Chamala Kiran Kumar Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐడెంటిటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ఢిల్లీలో మీడియాలో మాట్లాడిన ఆయన కేటీఆర్ విమర్శలను తిప్పికొడుతూ పదునైన విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని యాంకర్లు యాక్టర్లు గుర్తించకపోవడం ఆయన ఐడెంటిటీ సమస్య అని కేటీఆర్ అనడాన్ని చామల తప్పుబట్టారు. ఔను కేటీఆర్.. అషు రెడ్డి లాంటి యాంకర్లు రకుల్ ప్రీత్ సింగ్ లాంటి యాక్ట్రెస్ లు మిమ్మల్ని గుర్తించినట్లు రేవంత్ రెడ్డిని గుర్తించలేరని ఎద్దేవా చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గులాబీ జెండాల ప్రచారం కోసం కోట్ల రూపాయలు వెచ్చించి యాంకర్లతో పాటలు పాడించి డ్యాన్సులు వేయించారని చామల ఆరోపించారు. అందుకే వారు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. చేనేత కార్మికుల కష్టాలు తీర్చడం మానేసి నటి రకుల్ ప్రీత్ సింగ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించి ర్యాంప్ వాక్ చేయించిన చరిత్ర మీదని గుర్తు చేశారు. అటువంటి ప్రచారాలు చేశారు కాబట్టే సినీ తారలు మిమ్మల్ని గుర్తిస్తారని మండిపడ్డారు. తమ పార్టీ పబ్లిసిటీ కోసం గల్లీల్లో డ్యాన్సులు చేయాలని స్టార్ హోటళ్లలో ర్యాంప్ వాక్ లు చేయాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన పోరాటాన్ని తెలంగాణ సమాజం గుర్తించిందని చామల పేర్కొన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ను గెలిపించి రేవంత్ రెడ్డిని తమ గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. అదే సమయంలో తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను తిరస్కరించి ఫాంహౌస్కు పంపిందని కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని బయటకు రావడం లేదని విమర్శించారు. దీనివల్ల ప్రజలు కూడా ఆయనను మర్చిపోయారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.
సినిమా తారల గుర్తింపు కంటే ప్రజల గుర్తింపు ముఖ్యమని చామల హితవు పలికారు. రేవంత్ రెడ్డి పాలన చూసి బీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని అందుకే ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో పోటీ పడాలే తప్ప వ్యక్తిగత గుర్తింపు గురించి మాట్లాడటం కేటీఆర్ స్థాయికి తగదని సూచించారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారమే రేవంత్ రెడ్డి లక్ష్యమని దాని కోసమే ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడించారు.
Read Also: ఎన్నికలు అయిపోయాయి.. ధరల బాదుడు షురూ.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు