Ganja Seizure: తెలంగాణలోకి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ముమ్మర తనిఖీలు చేపడుతోంది. ఈ క్రమంలో.. ఒడిశా నుండి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి నిల్వలను ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ బృందం మంగళవారం పట్టుకుంది. నిరంతరం నిఘా ఉంచుతున్న అధికారులు.. పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ Ch. శ్రీహరిరావు , వారి సిబ్బంది వైరా ఐఎంఎఫ్ఎల్ (IMFL) డిపో ఎదురుగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా వస్తున్న ఓ మారుతి కారును ఆపారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అందులో దాచి ఉంచిన 101.2 కిలోల ఎండు గంజాయి, 2.7 కిలోల హాషీష్ ఆయిల్ లభ్యమయ్యాయి. పట్టుబడిన మత్తు పదార్థాలు, కారు , సెల్ ఫోన్ కలిపి మొత్తం రూ. 67 లక్షల 20వేల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్కు చెందిన మహమ్మద్ అస్లాం S/O ఇస్లాముద్దీన్ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కారుకు HR 07 N 6184 అనే నకిలీ హర్యానా నంబర్ ప్లేటును వాడినట్లు గుర్తించారు. ఒడిశాలోని కలిమెల ప్రాంతం నుండి ఈ గంజాయిని సేకరించి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
సమర్థవంతంగా పనిచేసి గంజాయి ముఠాను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ కాసిం, జాయింట్ కమిషనర్ అంజన్ రావు, డిప్యూటీ కమిషనర్ G. జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ G. గణేష్, ఎన్ఫోర్స్మెంట్ టీమును ఎక్సైజ్ ఉన్నతాధికారులు అభినందించారు.
Also Read: మంత్రి ఆదేశం.. మున్సిపాలిటీ యాక్షన్.. మారుతున్న ధర్మపురి రూపురేఖలు!