Devji alias Tippiri Tirupati: దశాబ్దాల పాటు సాయుధ పోరాటంలో కొనసాగిన మావోయిస్టు పొలిట్బ్యూరో సభ్యుడు సెంట్రల్ కమిటీ ఇన్ఛార్జి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మంగళవారం జనజీవన స్రవంతిలోకి వచ్చారు. డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో లొంగిపోయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం అనారోగ్య కారణాల రీత్యా మాత్రమే తాను రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి రావాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తన నిర్ణయం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు ఏవీ లేవని.. ప్రజా సమస్యల పట్ల తన నిబద్ధత కొనసాగుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన మార్గాల్లో పోరాటం చేస్తానని ప్రకటించారు.
పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం.. మల్లోజుల వేణుగోపాల్ వైఖరిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు దేవ్జీ ఆచితూచి స్పందించారు. ప్రస్తుతం తాను అంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేనని.. వివరంగా మాట్లాడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఏదైనా ఒక వ్యక్తి గురించి లేదా ఒక విషయం గురించి మాట్లాడితే అది అనవసరమైన చర్చలకు.. అపార్థాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. వివాదాలకు తావు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తన అభిప్రాయాలను అత్యంత సంక్షిప్తంగా చెబుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్ని విషయాలను సమగ్రంగా వివరిస్తానని మావోయిస్టు మాజీ అగ్రనేత వెగ్గడించారు.
తెలంగాణ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఇదొక కీలక పరిణామంగా పోలీసులు భావిస్తున్నారు. దేవ్జీతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి.. రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు.. నూనె నర్సింహారెడ్డి వంటి అగ్రనేతలు ఒకేసారి ఆయుధాలు వదిలిపెట్టడం గమనార్హం. మొత్తం 40 మంది మావోయిస్టులు ఈ లొంగుబాటు ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ పరిణామంతో అడవుల్లో పార్టీ నెట్వర్క్ పూర్తిగా బలహీనపడిందని అధికారులు భావిస్తున్నారు.
Read Also: Maoist Surrender: అడవి బాట వీడిన మావోయిస్ట్ అగ్రనేతలు.. తెలంగాణలో ముగిసిన సాయుధ పోరాటం