ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పేదల ముసుగులో జరిగిన దోపిడీపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని శక్తులు సాగించిన దౌర్జన్యాలను ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. నకిలీ భూదాన్ పట్టాల పేరుతో అమాయక ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని మంత్రి మండిపడ్డారు. ఒక్కో స్థలాన్ని పలువురికి అమ్ముతూ పేదలను మోసం చేసిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు.
కనీస మౌలిక సదుపాయాలైన నీళ్లు, విద్యుత్, రోడ్లు లేని చోట పేదలు దుర్భర పరిస్థితుల్లో ఉండకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలనలో ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే వెలుగుమట్ల కాలనీని తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ వెలుగుమట్ల కాలనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కాలనీలో కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ముఖ్యంగా పేద పిల్లల చదువుల కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేస్తున్న వారికి ఈ మోడల్ కాలనీయే సమాధానం చెబుతుందని మంత్రి తుమ్మల అన్నారు. పేదలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూసిన వారి అసలు రంగు బయటపడిందన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయని ఆయన గుర్తు చేశారు. పేదల భూములను ఆక్రమించినా, వారిని వేధించినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఖమ్మం నగరం అభివృద్ధిలో భాగంగా వెలుగుమట్ల ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ALSO READ: Supreme Court: బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం కోర్టులో షాక్.. ఆ వ్యవహారంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్