Supreme Court: ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. దీంట్లో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను ముగిస్తున్నట్టుగా పేర్కొంది. క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంపై నెగ్గిన పదిమంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని పేర్కొంటూ వారిపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ కు కూడా ఫిర్యాదులు చేశారు. కాగా, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో విచారణ ముగించిన స్పీకర్ మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లు పార్టీ మారారనటానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కాగా, బీఆర్ఎస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా స్పీకర్ తరపున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగిసినట్టు చెప్పారు.
దీంట్లో వెల్లడైన వివరాల ఆధారంగా స్పీకర్ తగు నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పారు. పిటిషన్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందన్నారు. ఈ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించిందవి. స్పీకర్ ఈ అంశంలో ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసినట్టేనని పేర్కొంది. స్పీకర్ తన తీర్పును రెండు రోజుల్లో అధికారికంగా వెలువరించి ప్రతులను ఫిర్యాదుదారులకు అంద చేయాలని సూచించింది.
Also Read: RTC Workers Issues: రిటైర్డ్ ఉద్యోగుల సొమ్ముపై రేవంత్ సర్కార్ కన్ను? హరీశ్ రావు సంచలన కామెంట్స్!