Neopolis Water: హైదరాబాద్ నగర విస్తరణలో భాగంగా కోకాపేట నియోపోలిస్ (Neopolis) ప్రాంతం అంతర్జాతీయ స్థాయి హబ్గా ఎదుగుతోంది. ఇక్కడ పెరుగుతున్న జనాభా , భారీ భవనాల అవసరాలకు అనుగుణంగా తాగునీటి కొరత లేకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జలమండలికి 3.95 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా, మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసింది.
ఈ కేటాయించిన స్థలంలో అత్యాధునికమైన సంప్ (Sump), పంప్ హౌస్, సెక్షన్ ఆఫీస్, గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ (GLSR),మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (STP) పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులోని అతిపెద్ద విశేషం ఏమిటంటే.. నియోపోలిస్ నుంచి గ్రావిటీ ద్వారా మెహదీపట్నం, షేక్ పేట వంటి దిగువ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయవచ్చు. దీనివల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. గోదావరి జలాలను ఎటువంటి అదనపు పంపింగ్ ఛార్జీలు లేకుండా నేరుగా బోజగుట్ట రిజర్వాయర్ కు తరలించే అవకాశం ఏర్పడుతుంది. ఇది ఆర్థికంగా జలమండలికి పెద్ద వెసులుబాటు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ (ఫేజ్-II & III) ద్వారా అదనంగా 300 ఎంజీడీ నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నీటితో కేవలం తాగునీటి అవసరాలే కాకుండా.. మూసీ నది పునరుజ్జీవం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపనున్నారు.
ఈ సమగ్ర ప్రణాళిక వల్ల పశ్చిమ హైదరాబాద్లోని ఐటీ కారిడార్ ,పరిసర ప్రాంతాలకు వచ్చే 30 ఏళ్ల వరకు నీటి కష్టాలు తీరనున్నాయి. నియోపోలిస్ లేఅవుట్ లో ప్రస్తుతం జరుగుతున్న పనులు పూర్తయితే.. ఆ ప్రాంతం స్వయం సమృద్ధి కలిగిన మోడల్ టౌన్షిప్గా మారుతుంది.
Also Read: ఏసీబీ ట్రాప్.. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం లంచం తీసుకుంటూ హోంగార్డ్ అరెస్ట్