ACB Raids : మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్లో వెలుగుచూసిన అవినీతి ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక సాధారణ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం సామాన్యులను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారో ఈ ఘటన అద్దం పడుతోంది.
కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ నగేష్, తోటకూర మహేష్ అనే వ్యక్తి మృతికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పించేందుకు లంచం డిమాండ్ చేశాడు. గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్ పేరును వాడుకుంటూ.. రిపోర్ట్ కావాలంటే మొదట రూ. 2 లక్షల ఇవ్వాలని మృతుడి మేనల్లుడు శరత్ను వేధించాడు. నెలలు గడుస్తున్నా రిపోర్ట్ రాకపోవడంతో.. బాధితుడు అనేక మార్లు బ్రతిమిలాడగా చివరకు 40 వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది.
మహేష్ చనిపోయి నాలుగు నెలలు గడుస్తున్నా రిపోర్ట్ చేతికి అందకపోవడంతో బాధితుడు శరత్ అన్ని మార్గాలను అన్వేషించాడు. చివరకు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ (CMO) నుండి ఫోన్ చేయించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఉన్న హోంగార్డ్ నగేష్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైస్థాయి ఒత్తిళ్లు కూడా పని చేయకపోవడంతో విసిగిపోయిన బాధితుడు చివరకు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించాడు.
శరత్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో నిఘా పెట్టారు. మొదటి విడతగా ఇప్పటికే రూ.5 వేలు తీసుకున్న నగేష్ రెండవ విడతగా మిగిలిన రూ. 35 వేల తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేశారు. డబ్బు తీసుకుంటున్న సమయంలోనే నగేష్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నగేష్ను అదుపులోకి తీసుకుని.. ఈ వ్యవహారంలో డాక్టర్ల పాత్ర లేదా ఇతర పోలీసుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
సామాన్యులకు అండగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థలో ఇలాంటి ఘటనలు జరగడం విచారకరం. బాధితుడు ధైర్యంగా ఏసీబీని ఆశ్రయించడం వల్లనే ఈ అవినీతి తిమింగలం పట్టుబడింది.
Also Read:‘హరీష్ రావు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే!’.. నాయిని ఘాటు వ్యాఖ్యలు