Komatireddy Venkat Reddy: నల్గొండలో జరిగిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నగర కార్పొరేషన్ పరిధిలోని 48 మంది కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ఎంఐఎం (MIM) పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ఏ సమస్య వచ్చినా మేయర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని అన్నారు. పెద్దవాళ్లు తినే బియ్యమే ఈ రోజు పేదలకు అందుతోందని.. ప్రభుత్వం 5 వేల కోట్లు ఉచిత కరెంటు బిల్లుల కోసం చెల్లించిందని వివరించారు. ఒక్కో కుటుంబానికి సుమారు 50 వేల రూపాయల భారం తగ్గించామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని.. ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి సహకారంతో నల్గొండలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
గతంలో ఎంపీగా ఉన్న పరిచయాలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. నగరం దెబ్బతినకుండా 700 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి అభివృద్ధి కోసం పనిచేయాలని.. మూడేళ్లలో నల్గొండ కార్పొరేషన్ జాతీయ అవార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. నగరంలో తాగునీటి వ్యవస్థ సరిగా లేదని గుర్తుచేస్తూ.. వెంటనే నీటి సరఫరా మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా సమస్య ఉంటే తాను అండగా ఉంటానని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణ జాగృతిలోకి కావేటి మనోహర్.. కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత