మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠకు, హైడ్రామాకు దారితీసింది. శుక్రవారం ఉదయం నుండే స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వచ్చాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ వర్గాల మధ్య నెలకొన్న వాగ్వాదంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. చివరకు శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపుతూ అధికారులు ఎన్నికను వాయిదా వేయడంతో ఇరు పక్షాలు తిరిగి క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి.
ఎన్నిక ప్రారంభం కావాల్సిన సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రంగంలోకి దిగి, ఎన్నికను వాయిదా వేయాలని పట్టుబట్టారు. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆమె రిటర్నింగ్ అధికారితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు, తమకు స్పష్టమైన బలం ఉందని వెంటనే ఎన్నిక నిర్వహించి తీరాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు భీష్మించారు. సరైన సాంకేతిక కారణం లేకుండా ఎన్నికను వాయిదా వేయలేమని రిటర్నింగ్ అధికారి తొలుత స్పష్టం చేసినప్పటికీ, ఎమ్మెల్యే ఒత్తిడి మరియు ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, ఈ వాయిదా నిర్ణయంపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఎన్నికను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు తిరిగి ఎన్నిక జరిపేందుకు సిద్ధం కాగా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరోసారి అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి పోలీసులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికను అధికారికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ పరిణామాల అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తమ మద్దతుదారులైన కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపాలిటీ నుండి వెనుదిరిగారు. రేపు ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో తమ కౌన్సిలర్లను మళ్ళీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యవేక్షణలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో క్యాంపుకు తరలివెళ్లారు. మొత్తానికి తొర్రూరు మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ALSO READ: Madira Municipality: మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం.. చైర్పర్సన్గా సామినేని సుజాత ఎన్నిక