Gold Man Konda Vijay Kumar: హైదరాబాద్ షేర్లింగంపల్లికి చెందిన గోల్డ్ మ్యాన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ ను ఢిల్లీ విమానాశ్రయంలో ఆదాయపు పన్ను (IT) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీ వెళ్లగా, అక్కడ సుమారు 12 గంటల పాటు అధికారులు ఆయన్ను విచారించారు.
హైదరాబాద్ విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో ఆయన ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుండటం సీఐఎస్ఎఫ్ (CISF) అధికారులకు కొంత అనుమానం కలిగించింది. నిరంతరం ఒంటిపై కిలోల కొద్దీ బంగారం ధరించే ఆయన ప్రవర్తనపై నిఘా ఉంచిన అధికారులు, ఆ సమాచారాన్ని వెంటనే ఐటీ విభాగానికి చేరవేశారు. ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే, నలుగురు ఐటీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ధరించిన ఆభరణాలను స్కాన్ చేసి, అవి అసలువా కాదా అని నిర్ధారించుకున్నట్లు ఆయన తెలిపారు.
తన వద్ద ఉన్న బంగారం అంతా చట్టబద్ధమైనదేనని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. “ఏ ధైర్యం లేకుండా ఇంత బంగారం ఒంటిపై వేసుకుని తిరగలేము కదా” అని ఆయన ప్రశ్నించారు. తనిఖీల సమయంలో తన వద్ద ఉన్న కొన్ని బిల్లులను అధికారులకు చూపించానని, దాంతో కొన్ని ఆభరణాలను వెంటనే తిరిగి ఇచ్చేశారని చెప్పారు. అయితే, మరికొన్ని ఆభరణాలకు సంబంధించిన రశీదులను 15 రోజుల తర్వాత సమర్పించాలని అధికారులు కోరినట్లు ఆయన వెల్లడించారు. తన వద్ద ప్రతి చిన్న వస్తువుకు సంబంధించిన రశీదులు ఉన్నాయని, త్వరలోనే చార్టెడ్ అకౌంటెంట్తో కలిసి పూర్తి ఆధారాలు సమర్పిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
5 నుండి 12 కిలోల బంగారం ధరించడమే కాకుండా, హోప్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విజయ్ కుమార్ గుర్తింపు పొందారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఐటీ శాఖ ఈ తనిఖీలు చేపట్టినప్పటికీ, ఇది కేవలం రొటీన్ చెకప్ మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. అధికారులు తన పేరిట ఉన్న స్థిర, చర ఆస్తులతో పాటు హోప్ ఫౌండేషన్ లావాదేవీల గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం.
ప్రస్తుతానికి విజయ్ కుమార్ హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతి లభించింది. అయితే, ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుల ప్రకారం ఆయన మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
Read Also: పక్కన కూర్చుంటే తప్పేంటి.. ప్రోటోకాల్ ఉల్లంఘనా.. మేయర్ మమత ఫైర్..?