Mayor Mamata: స్వేచ్ఛ బ్యూరో: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి బడ్జెట్ సమావేశంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదంపై మేయర్ మమత ఘాటుగా స్పందించారు. ఆదివారం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆమె, బీఆర్ఎస్ కార్పొరేటర్లు సృష్టించిన రగడ వెనుక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రేరేపణ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్న జరిగిన సమావేశంలో ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేస్తూ, ఈ వివాదాన్ని రాజకీయంగా మలచడం సరైంది కాదన్నారు.
ఈనెల 28న జరిగిన తొలి బడ్జెట్ సమావేశంలో మేయర్ మమత పక్కన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి కూర్చోవడం వివాదానికి దారి తీసింది. మేయర్ మాత్రమే పోడియంలో కూర్చోవాలని పేర్కొంటూ బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై స్పందించిన మమత, “నేను రాజకీయాలకు కొత్తగా వచ్చాను. నాకు ధైర్యం ఇవ్వడానికి ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ నా పక్కన కూర్చున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు” అని తెలిపారు. అలాగే “ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి నన్ను సొంత చెల్లెలిలా చూసుకుంటూ నైతిక బలం ఇస్తున్నారు” అని పేర్కొన్నారు.
Also Read: ఇవి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లా.. సర్కార్ పై ఈటల రాజేందర్ నిప్పులు..!
బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్పై ఆమె తీవ్రంగా స్పందిస్తూ, “కీలకమైన బడ్జెట్ సమావేశం నుంచి బయటకు వెళ్లడం బాధాకరం. ఇది బీఆర్ఎస్ నాయకులకు కాదు… ప్రజలకు నష్టం. సభ్యుల వాకౌట్ వల్ల ప్రజల సమస్యలు చర్చకు రాకుండా పోయాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే “వాళ్లు స్వచ్ఛందంగా వెళ్లలేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిశానిర్దేశంతోనే సభ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది” అని ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై మమత మరింత ఘాటుగా స్పందిస్తూ, “గత పదేళ్లుగా నా కుటుంబాన్ని అణగదొక్కారు. ఇప్పుడు నన్నే టార్గెట్ చేస్తున్నారు.
ఇకపై ఇలాంటి రాజకీయ ఒత్తిడిని అస్సలు సహించేది లేదు. మీ పని మీరు చూసుకోండి. మీ గౌరవం నిలుపుకునేలా ప్రవర్తించండి” అంటూ హెచ్చరించారు.
ఆదివారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెద్దగొళ్ల నరసింహులు యాదవ్, రామస్వామి తదితరులతో పాటు యువ నాయకుడు గుమాల్ శ్రీనివాస్ ముదిరాజ్ కూడా పాల్గొని మేయర్కు మద్దతు తెలిపారు. కార్పొరేషన్ సమావేశంలో తలెత్తిన ఈ వివాదం పట్టణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారగా, రాబోయే రోజుల్లో మరింత రాజకీయ వేడి రగిలించే అవకాశం కనిపిస్తోంది.
Also Read: ట్రై కమిషనరేట్లలో మందుబాబుల మజాకా.. పోలీసుల తడాఖా..!