Insurance: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని లక్షలాది మంది మత్స్యకారుల జీవితాలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ప్రతి ఏటా క్రమం తప్పకుండా చెల్లించాల్సిన మత్స్యకారుల గ్రూప్ ఇన్సూరెన్స్ (బీమా) ప్రిమియం సొమ్మును ప్రభుత్వం సకాలంలో జమ చేయకపోవడంతో ఈ నెల రెండోవారంతో రెన్యూవల్ గడువు ముగిసిపోయినట్లు సమాచారం. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 4.2లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలు ఇప్పుడు ఎటువంటి బీమా రక్షణ లేని అభద్రతా స్థితిలోకి నెట్టబడ్డాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లేదా అలసత్వం మత్స్యకారుల బీమాకు పూర్తిగా మంగళం పాడేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మత్స్యకారుల సంక్షేమం గురించి వేదికలపై పొగడ్తలు కురిపించే పాలకులు, క్షేత్రస్థాయిలో వారి రక్షణను గాలికొదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. జూలై 15 లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రిమియం సొమ్ము చెల్లించాల్సి ఉండగా, గడువు ముగిసి రోజులు గడుస్తున్నా నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. నిధుల విడుదలలో ప్రభుత్వ అలసత్వం ఒకవైపునా గడువు ముగుస్తున్నా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంలో విఫలమైన మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కాలంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఏ మత్స్యకారుడైనా ప్రాణాలు కోల్పోతే, ఆ కుటుంబానికి బీమా పరిహారం అందే అవకాశం లేకుండా పోయింది.
ఒక్కో మత్స్యకారుడి ప్రాణానికి రక్షణ కల్పించేందుకు చెల్లించాల్సిన వార్షిక ప్రిమియం ఎంతో తెలుసా? కేవలం 91 రూపాయలు మాత్రమే! ఇంత చిన్న మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించలేకపోవడం ప్రభుత్వాల ప్రాధాన్యతలకు అద్దం పడుతోంది. ఈ 91 రూపాయల ప్రిమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కింది నిష్పత్తిలో పంచుకుంటాయి. కేంద్రం తన 60 శాతం వాటాను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని 40 శాతం వాటాను సకాలంలో విడుదల చేయకపోవడం వల్లే ఈ ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం. ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపానికి పేద మత్స్యకారుల జీవితాలు బలిపశువులవుతున్నారనే ప్రచారం జరుగుతుంది.
Also read: తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?
వేటకు వెళ్లిన భర్త క్షేమంగా తిరిగి వస్తాడో లేదో తెలియని ఆందోళనలో ఉండే మత్స్యకార మహిళలకు ఈ వార్త శూలంలా మారింది. “రూ. 91ల ప్రిమియం కట్టకుండా మా ప్రాణాలతో చెలగాటమాడుతారా?” అని గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే తమ కుటుంబాలను ఆదుకునే నాథుడెవరని వారు ప్రశ్నిస్తున్నారు. బీమా కింద మత్స్యకారుడు ప్రమాద వశాత్తు మృతి చెందితే రూ.5లక్షలు, శాశ్వత అంగవైకల్యం చెందితే 2.5లక్షలు, ఆసుపత్రి ఖర్చుల కింద 25వేలు అందజేస్తున్నారు.
ఈ 4.2 లక్షల మంది మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రతి ఏటా మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన బీమా పథకం కింద సుమారు 39కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అందులో రాష్ట్రవాటా సుమారు 15కోట్ల వరకు ప్రత్యేక చొరవ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి, పెండింగ్ ప్రిమియం సొమ్మును తక్షణమే చెల్లించి బీమా గడువును పొడిగించేలా చర్యలు చేపట్టాలని పలు మత్స్యకారసంఘాల కోరుతున్నాయి. లేనిపక్షంలో మత్స్యకారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని పేర్కొంటున్నాయి.
Also read: CMO Report: సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్లో 26 మంది ఎమ్మెల్యేలు.. అక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్?