Telangana Panchayat Elections: కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం సీమారిపెట్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గెలుపు మత్తులో విజేత వర్గీయులు ప్రత్యర్థులపై దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సీమారిపెట్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కుర్మా పాపయ్య విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన అనంతరం పాపయ్య వర్గీయులు, ఓడిపోయిన ప్రత్యర్థి రాజు ఇంటిపైకి ట్రాక్టర్తో వెళ్లి వీరంగం సృష్టించారు. “మా మీదే పోటీ చేస్తారా” అంటూ ఆగ్రహంతో రాజు ఇంటిపై దాడికి దిగారు.
ఈ క్రమంలో అడ్డువచ్చిన రాజు కుటుంబ సభ్యులైన మహిళలను సైతం లెక్కచేయకుండా వారిని ట్రాక్టర్తో ఢీకొట్టడం కలకలం రేపింది. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు, బాధితులు భగ్గుమన్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నేత కుర్మా పాపయ్య, అతడి వర్గీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో హైటెన్షన్
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాపయ్య విజయం
గెలిచిన అనంతరం ప్రత్యర్థి బాలరాజు ఇంటిపై ట్రాక్టర్తో దాడి చేసిన పాపయ్య వర్గీయులు
బాలరాజు కుటుంబాన్ని ట్రాక్టర్తో ఢీకొట్టిన వైనం… pic.twitter.com/a2ZjA6Sudb
— BIG TV Breaking News (@bigtvtelugu) December 15, 2025
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి సొంతగడ్డపైనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె స్వగ్రామమైన తొర్రూరు మండలం చెర్లపాలెంలో ఆమె బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఝాన్సీరెడ్డి అధికారికంగా బలపరిచిన అభ్యర్థి కిరణ్పై.. రెబల్ నేత, తొర్రూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి వర్గానికి చెందిన మహేందర్ ఘన విజయం సాధించారు.
ఝాన్సీరెడ్డి అభ్యర్థి ఓడిపోవడంతో గ్రామస్తులు, తిరుపతి రెడ్డి వర్గీయులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ఝాన్సీరెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె నియంతృత్వ పోకడల వల్ల అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆమె తన ఒంటెద్దు పోకడలు మాని, తీరు మార్చుకోవాలని హితవు పలికారు. సొంతూరులో రెబల్ అభ్యర్థి గెలుపు ఝాన్సీరెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది.
Read Also: Delhi Pollution: ప్రమాదకర స్థాయిలో పొగమంచు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ ప్రజలు..