Formula E Race Case: ఫార్ములా–E రేస్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరింది. నెలల తరబడి సాక్ష్యాలు, డాక్యుమెంట్లు, ఫైళ్లు, చెల్లింపులు, బాండ్ల ట్రయిల్స్ను పరిశీలించిన ACB తాజాగా ప్రభుత్వంకు ఫైనల్ రిపోర్టు సమర్పించింది. 2024 డిసెంబర్ 19న నమోదు చేసిన ఈ కేసులో సెప్టెంబర్ 9న అధికారిక రిపోర్టు అందింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ను ఏ1, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏ2, బీఎల్ఎన్ రెడ్డిని ఏ3, అలాగే FEO సంస్థ ప్రతినిధులను ఏ4, ఏ5లుగా చూపించింది.
ఏసీబీ ప్రధానంగా గుర్తించిన అంశాల్లో.. ఫార్ములా–E రేస్ను నిర్వహించే ఆలోచన, నిర్ణయం పూర్తిగా కేటీఆర్ వ్యక్తిగత నిర్ణయం అన్నది. ప్రభుత్వ అంగీకారం లేకుండానే, సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే, పూర్తిగా ప్రైవేట్ చర్చల ద్వారానే ఈవెంట్ ప్లాన్ చేసినట్లు ఏసీబీ రిపోర్టు నిర్ధారించింది.
అంతేకాదు, రాష్ట్ర బిజినెస్ రూల్స్, ఆర్టికల్ 166(1), 299 వంటి రాజ్యాంగ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లు వెల్లడించింది. మునిసిపల్ శాఖ, ఆర్థిక శాఖ, సీఎస్, ఎవరిని సైతం ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా అనుమతులు ఇచ్చినట్లు రిపోర్టు పేర్కొంది.
FEOకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత, బీఆర్ఎస్ పార్టీకి రూ. 44 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ చెల్లించబడినట్లు ఏసీబీ రిపోర్టులో ప్రధానంగా పేర్కొంది. ఇవి ట్రైపార్టీ అగ్రిమెంట్కి ముందే 2022 ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య చెల్లించబడినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.
రెండు కీలక అగ్రిమెంట్లు కూడా గవర్నర్ సంతకం లేకుండానే ఎగ్జిక్యూట్ చేయడమే కాదు, MAUD శాఖ అనుమతి కూడా తీసుకోలేదని రిపోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, 10 కోట్లకు పైగా చెల్లింపులకు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అయినా, దీనిని పూర్తిగా ధిక్కరించినట్లు ఏసీబీ పేర్కొంది.
2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, అక్టోబర్ 30న రెండో అగ్రిమెంట్ను కేటీఆర్, అరవింద్ కుమార్ల సంతకాలతో ఫైనల్ చేశారని రిపోర్టులో స్పష్టంగా ఉంది. ఇది ప్రత్యక్షంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన అని ఏసీబీ పేర్కొంది.
ట్రైపార్టీ అగ్రిమెంట్లో హెచ్ఎండిఏ పేరు లేకపోయినా .. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి నిర్ణయాలతో హెచ్ఎండిఏ నుంచి..
సీజన్ 9 కోసం అక్రమంగా 20 కోట్లు
FEOకి 46 కోట్లు బిల్లు
సీజన్ 10 కోసం 54.88 కోట్లు
ఆర్బిఐ, జీఎస్టీ ఉల్లంఘనలతో అదనంగా 8 కోట్లు ఫైన్
మొత్తం మీద, సీజన్ 10, 11, 12 కలిపి 600 కోట్లకు పైగా ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతుందని ఏసీబీ రిపోర్టు హెచ్చరించింది.
మాజీ మంత్రి కేటీఆర్ పలుమార్లు చూపించిన రూ.700 కోట్ల లాభం వచ్చిందన్న ‘నైల్సెన్ రిపోర్టు’ పూర్తిగా అబద్ధపు కథనమని ఏసీబీ రిపోర్టు తేల్చింది. ప్రభుత్వంలోని ఒక్క శాఖ వద్ద కూడా ఆ రిపోర్టుకు ప్రూఫ్ లేదా సపోర్టింగ్ డేటా లభించలేదని స్పష్టం చేసింది.
PC Act 13(1)(a), 13(2) – ప్రజాప్రతినిధులుగా ఉండి అధికార దుర్వినియోగం
IPC 409 – పబ్లిక్ నిధుల దుర్వినియోగం
IPC 120(B) – క్రిమినల్ కుట్ర
ఐపీసీ సెక్షన్ 409 అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజానీధులు దుర్వినియోగం చేశారు. ఐపీసీ సెక్షన్ 120 బి నిందితులు అందరూ కలిసి క్రిమినల్ కాన్స్పేరెసి కి పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంది.