బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సమయం, సందర్భానుగుణంగా ఆయన చేస్తున్న విమర్శలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత పదేండ్లలో వారి పాలనకు.. ఇప్పుడు జరుగుతున్న పాలన మీద క్రాస్ చెక్ చేసుకుంటున్నారా? అని పలువురు సోషల్ మీడియా వేదికగా చర్చ పెడుతున్నారు. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య గత పదేండ్లు, ఇప్పుడు రెండున్నరేండ్ల పాలన మీద పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సెషన్స్ ఆరంభం నుంచే కేటీఆర్ అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఆరు గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చారు. మూసీ పునరుజ్జీవం, హిల్ట్ పాలసీ, భూముల బదాయింపులో పెద్ద ఎత్తున కుంభకోణం దాగుందని ముందు నుంచి ఆరోపిస్తున్నారు.
అయితే, రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేటీఆర్ కొత్త రాగం ఎంచుకున్నారు. రైతులు పండించిన పంటను సర్కారు కొనుగోలు చేయకపోవడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ)కి చెందిన తుడుం గణపతి అనే రైతు ఆత్మహత్యకు పాల్పడగా.. ఇది ప్రభుత్వ హత్యే అని.. అందుకు రేవంత్ సర్కారు బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇటీవల తాను రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఆదిలాబాద్ వెళ్లగా.. మార్కెట్ యార్డులో నాలుగు రోజుల కిందట తెచ్చిన సోయాబీన్ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని.. పంట అమ్ముడుపోకపోతే తనకు చావే శరణ్యమని గణపతి రోదిస్తూ వేడుకున్నాడని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన మరణంపై రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలని కోరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అంతే దీటుగా సమాధానాలు ఇస్తున్నారు. గత పదేండ్లలో కళ్లాల్లోనే ధాన్యం, పంట వర్షానికి తడిసి ముద్దయినా పట్టించుకోని పాలన బీఆర్ఎస్ది అని వారు గుర్తుచేస్తున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సుమారు 6 వేలమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, అప్పుడు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ చేయక, పంట కొనక, రైతబంధు ఇవ్వక, బ్యాంకు సిబ్బంది వేధింపుల కారణంగా ఎంతో మంది అన్నదాతలు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారని.. ఆ లెక్క మరిచారా? కేటీఆర్.. అని నిలదీస్తున్నారు. అన్నదాతలను పట్టించుకోకపోవడం వల్లే కదా? వారంతా కలిసి కారుకు పంక్ఛర్ చేసి అధికారం నుంచి దింపేశారని.. గతం మరిస్తే భవిష్యత్ ఉండదని స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.
ఇదిలాఉండగా, ఇంతకాలం రైతుభరోసాపై ప్రతిపక్షాల విమర్శలకు రేవంత్ సర్కార్ చెక్ పెట్టింది. నేడు రైతుభరోసా పంపిణీ ఉంటుందని ప్రభుత్వం గత వారం రోజులుగా లీకులు ఇస్తూ వస్తున్నది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈనెల 22న రైతు భరోసా వేస్తామని ప్రకటించారు. మొత్తంగా 70 లక్షల మంది రైతులకు తొలి విడత కింద రైతు భరోసా రూ.6 వేలు పడనుంది.ఇందులో పెద్ద, చిన్నా రైతులు అనే తేడా లేకుండా అందరు రైతులు (ఎకరంలోపు) ఉన్న వారికి భరోసా జమకానున్నది.ఇప్పటికై రైతు బోనస్ చెల్లించిన ప్రభుత్వం.. తాజాగా రైతు భరోసా కూడా వారి ఖాతాల్లో జమ చేస్తున్నది. ప్రభుత్వం సకాలంలో అన్నదాతలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నదని, ఇకనైనా విమర్శలు చేయడం మానుకుని, ప్రభుత్వానికి సహకరించాలని అధికార పార్టీ నేతలు, శ్రేణులు కోరుతున్నారు.