Gurukul School: స్వేచ్ఛ బ్యూరో: ఒకప్పుడు పేద, అనాథ పిల్లల ఆశాజ్యోతి చదువుల తల్లి నిలయం దేశం నలుమూలల నుంచి విద్యార్థులు పోటీ పడి చేరిన విద్యాలయం నేడు మాత్రం నిశ్శబ్దంగా గోడలు మాట్లాడుతున్నాయి. ఇదే బన్సీలాల్ వ్యాస్ జీ స్థాపించిన ఘట్కేసర్ గురుకుల విద్యాలయం దుస్థితి. 1938లో వికారాబాద్ అనంతగిరిలో ఒక మహోన్నత సంకల్పంతో ప్రారంభమైన ఈ గురుకులం కుల నిర్మూలన, స్త్రీ విద్య, సమానత్వం లక్ష్యాలుగా ముందుకు సాగింది. ప్లేగు మహమ్మారి నేపథ్యంలో 1942లో ఘట్కేసర్కు తరలించిన ఈ విద్యాలయం, 26 ఎకరాల్లో విశాలంగా విస్తరించి, వేద విద్య నుంచి వృత్తి విద్య వరకు అందిస్తూ ఒక ఆదర్శ విద్యా కేంద్రంగా నిలిచింది.
మహాత్మా గాంధీ కూడా అనాధ విద్యార్థులను ఇక్కడ చేర్పించారని చెప్పేంతగా ఈ గురుకులానికి ఖ్యాతి. ఉచిత విద్య, భోజనం, వసతి అన్నీ అందుబాటులో ఉండటంతో పేదల పిల్లలకు ఇది నిజంగా స్వర్గం లాంటిదే. కానీ 1956లో బన్సీలాల్ వ్యాస్ మరణం తర్వాత పరిస్థితులు మారాయి. ట్రస్టులో వివాదాలు, భూముల అన్యాక్రాంతం, ప్రభుత్వాల నిర్లక్ష్యం కలిసి గురుకులాన్ని క్రమంగా కుంగదీశాయి. మాదాపూర్లోని 627 ఎకరాల భూమి సహా అనేక ఆస్తులు వివాదాల్లో చిక్కుకుని, కోట్లాది రూపాయలు బ్యాంకుల్లోనే నిలిచిపోయాయి. ఒకప్పుడు 36 మంది ఉపాధ్యాయులతో నిండిన ఈ విద్యాలయం నేడు కేవలం 4 మంది టీచర్లతోనే కొనసాగుతోంది. వందలాది మంది విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలో ప్రస్తుతం కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం పరిస్థితి ఎంత దయనీయమో చెబుతోంది.
Also Read: GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్.. కొత్త కమిటీలు ఎర్పాటు..!
శిధిలావస్థకు చేరుకున్న భవనాలు, ఖాళీ తరగతి గదులు, మూగబోయిన వసతి గృహాలు, ఇవే ఇప్పుడు గురుకులం గుర్తులు. కోట్ల ఆస్తులు ఉన్నా ఆదాయం ఉపయోగించుకోలేని పరిస్థితి. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉండటంతో ట్రస్టు నిధులు తాకకుండా నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా, గత 286 రోజులుగా విద్యార్థులు ఉత్తరాల ఉద్యమం చేపట్టి ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు అందరికీ తమ బాధను తెలియజేస్తున్నారు. “గురుకులాన్ని కాపాడండి బన్సీలాల్ ఆశయాలను నిలబెట్టండి” అని వేడుకుంటున్నారు. ఒకవైపు ఆర్య సమాజం, మరోవైపు దేవాదాయ శాఖ, ఇంకోవైపు ప్రభుత్వం ఇలా మూడు వైపులా ఆధిపత్య పోరాటం నడుస్తుండగా గురుకులం మాత్రం నిశ్శబ్దంగా కూలిపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ట్రస్టు సమస్యలను పరిష్కరించి, వేల కోట్ల ఆస్తులను రక్షించి, గురుకులానికి పూర్వ వైభవం తీసుకురాగలదా? లేక చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం ఇలానే ముగిసిపోతుందా? అన్న ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.
గత 280 రోజులుగా ఈ పాఠశాలను కాపాడాలని ఉత్తరాల ఉద్యమం కొనసాగిస్తున్నామని, పాఠశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందిని ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ అన్నారు. ఈ విద్యాసంస్థను ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్’గా కేజీ నుంచి పీజీ వరకు అభివృద్ధి చేస్తే, ఐదు మండలాల పేద విద్యార్థులకు ఇది గొప్ప వరంగా మారుతుంది. మేమంతా పూర్వ విద్యార్థులం కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ప్రతిరోజూ ముఖ్యమంత్రికి ఒక ఉత్తరం రాస్తూ, ఈ పాఠశాల పునరుద్ధరణ కోసం విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించి కేజీ టు పీజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఈ విద్యాలయాన్ని కాపాడాలని కోరుతున్నామని అని తెలిపారు.
Also Read: Property Tax: ట్యాక్స్ కలెక్షన్పై సర్కార్ ఫోకస్.. అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేనా..!