తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఫోన్ ట్యాపింగ్, ఇతర కేసులకు సంబంధించి విచారణ ముమ్మరం చేస్తున్న తరుణంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్(SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు కేటీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు.
కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లోని నంది నగర్లో గల కేటీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తుండగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పక్షం స్పష్టం చేస్తోంది.
నోటీసులు అందుకున్న వెంటనే కేటీఆర్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు చేరుకుని కేసీఆర్తో భేటీ అయ్యారు. తాజాగా కేటీఆర్ కూడా వారితో కలవడంతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా కీలక చర్చలు సాగుతున్నాయి. సిట్ నోటీసులను న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి? రాజకీయంగా ప్రభుత్వంపై ఎలా విరుచుకుపడాలి? అనే అంశాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ ఈ నోటీసులపై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సిట్ విచారణకు నేరుగా హాజరు కావాలా..? లేక మధ్యంతర ఉపశమనం కోసం పిటిషన్ వేయాలా..? అనే కోణంలో న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కేసీఆర్ సూచనల మేరకు రేపు ఉదయం కేటీఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
ఈ పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ ఇద్దరూ కేసీఆర్తో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు, ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
ALSO READ: Vijayasai Reddy: జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు