KTR: కేసీఆర్ విచారణ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ఆయన మూడు ముక్కల్లో “డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్” (Diversion, Subversion, Perversion) అని అభివర్ణించారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, నీచమైన రాజకీయాలకు పాల్పడటమే ఈ ప్రభుత్వ పనితీరుగా మారిందని ఆయన మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్ 2026లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఉద్దేశపూర్వకంగా నేడు కేసీఆర్ విచారణను తెరపైకి తెచ్చారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రం నుండి 8+8 మంది బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా అని, ఈ వైఫల్యంపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ‘ఫోకస్ షిఫ్ట్’ కోసం ఆదివారం పూట విచారణ నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. సిట్ (SIT) అధికారులు చట్టాన్ని, నిబంధనలను గౌరవించకపోయినా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న బాధ్యత గల నేతగా కేసీఆర్ పూర్తిస్థాయిలో సహకరించారని, ప్రతి ప్రశ్నకూ కుండబద్దలు కొట్టినట్లు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరుగుతున్నా, గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. సమ్మక్క-సారక్క జాతరలో భక్తులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం విదేశీ విహారయాత్రల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఈ ‘లింకులు-లీకులు’ రాజకీయాలు ఆపి, బడ్జెట్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని, దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Phone Tapping Case: కేసీఆర్ విచారణలో పార్ట్-1 కంప్లీట్.. మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా?