KTR: ఇది ప్రజా ప్రభుత్వమా… లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు సంస్థలకు వత్తాసు పలకడమేనా ప్రజా పాలన? అని నిలదీశారు. గురువారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా చేనేత కార్మికుల పొట్టను కాంగ్రెస్ పార్టీ కొట్టిందని కేటీఆర్ ఆరోపించారు. రూ. 105 కోట్ల విలువ గల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ను వెనక్కి తీసుకోవడం వెనుక మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. సంక్షేమ శాఖ నుండి టెస్కోకు దక్కాల్సిన రూ. 200 కోట్ల దుస్తులు, దుప్పట్ల ఆర్డర్ ఇంకా ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంటి? అని ప్రశ్నించారు.
కమీషన్లు దండుకోవాలనే యావలో ప్రైవేట్ వ్యక్తులకు కాంగ్రెస్ ఆర్డర్లు ఇచ్చిందని ధ్వజమెత్తారు. నేతన్నల ఉసురు పోసుకుంటున్న కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఆర్డర్ ను రద్దు చేసి.. తిరిగి టెస్కోకు ఆ బాధ్యతను అప్పగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read: చౌకైన ప్లాన్.. ప్రతి రోజూ 3GB డేటా.. నెలంతా పండుగే పండుగ!
మరోవైపు గురువారం (ఏప్రిల్ 2) బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా కేటీఆర్ నివాళులు అర్పించారు. పీడిత పక్షాల కోసం పోరాడిన మహాయోధుడు పాపన్న అని కొనియాడారు. బహుజనుల ఆత్మగౌరవం కోసం, పీడిత పక్షాల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు అని పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనాన్ని భావితరాలకు అందించాలనే… కేసీఆర్ ప్రభుత్వం ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిందని గుర్తు చేశారు.
Also Read: ఇండక్షన్ స్టవ్ను.. నాన్ స్టాప్గా ఎంతసేపు వాడొచ్చు? ఇది తెలియకపోతే కష్టమే!