KTR: స్పీకర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికమని, దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం రాహుల్ గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్ పైన రాహుల్ గాంధీ తీవ్రమైన ఒత్తిడి ఉన్నదని, రాహుల్ గాంధీ కూడా రాష్ట్రం నుంచి వస్తున్న అడ్డగోలు సంచుల కట్టల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శాసనసభ స్పీకర్ చేతుల్లో ఏమీ లేదని, మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై దాడి అని, దీని వెనుక ఉన్న ప్రధాన నేరస్థుడు, ఆ నేరపూరిత ఆలోచన రాహుల్ గాంధీదే.. ఆయనే అసలు దోషి అన్నారు. ఆయన అనుమతి లేకుండా స్పీకర్ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకునే సాహసం చేయలేరన్నారు. తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఒకవైపు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ దానికి రక్షకుడినని చెప్పుకుంటూ, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో రాహుల్ గాంధీ ఒక జోకర్ గా నిలిచిపోయారన్నారు.
Also Read: Mad For Each Other: పాపులర్ జంటల ఎమోషనల్ ప్రేమ కథలు బయటపెట్టిన..మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోమో..
ఒక పార్టీ బి-ఫారంపై ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేయకుండానే మరో పార్టీ బీ-ఫారంపై ఎంపీగా ఎలా పోటీ చేస్తారు? అని ప్రశ్నించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకోలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఫిరాయింపుల అంశం పైన దానం నాగేందర్, కడియం శ్రీహరిలు చేసిన కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుందన్నారు. కడియం శ్రీహరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కానీ, ఎలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ కి వచ్చారు, ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గౌరవం, పదవులు ఏమిటో ఆయనకు ప్రశ్నించుకోవాలన్నారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం ఏంటి? ఆయన 2013లో వచ్చినప్పుడు కేసీఆర్ ఆయనను ఎంపీని చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంను చేశారు. ఆపై ఎమ్మెల్సీని చేశారు. తర్వాత ఎమ్మెల్యేని చేశారు. ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ వయసులో ఇలాంటి “మురికి” మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత సిగ్గులేకుండా ఎందుకు బతకాలి? మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను, నాయకత్వంతోనే ఉన్నాను అని మీరు చెప్పారు. అందుకే అడుగుతున్నాను, ఈ “థర్డ్ క్లాస్” మాటలు ఎందుకు? అని ప్రశ్నించారు.
ఖమ్మంలోని వెలుగుమట్లలో మంత్రుల బినామీల ప్రయోజనాల కోసం వెయ్యి మంది పేదల ఇళ్లను కూలగొట్టడం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. ఈ భూమి చరిత్రను వివరిస్తూ, 1950వ దశకంలో భూదానోద్యమ స్ఫూర్తితో ఇద్దరు పెద్దలు 62 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారని, అందులో 31 ఎకరాలను గతంలోనే కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మిగిలిన భూమిలో చట్టబద్ధంగా పట్టాలు పొంది, గత పదేళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఇప్పుడు కూల్చివేయడం ప్రభుత్వ వినాశకర ఆలోచనకు నిదర్శనమని విమర్శించారు. వెయ్యి మంది ఇళ్లను కూలగొట్టి, ఇప్పుడు కేవలం 310 మందికి 75 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడం ద్వారా మిగిలిన భూమిని ఎవరు నొక్కుతున్నారని నిలదీశారు.
గతంలో 100 గజాల పట్టా ఉన్న వారికి ఇప్పుడు తక్కువ భూమి ఇవ్వడం ఏంటని, ఇది సర్కార్ నడుపుతున్నారా లేక సర్కస్ నడుపుతున్నారా అని ఎద్దేవా చేశారు. బాధితులకు భోజనం పెడుతున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని, బాధితులను కిడ్నాప్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆ కేసులను ఉపసంహరించుకోవాలని, పోలీసులు తమ దాష్టికాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఎక్కడైతే ఇళ్లు కూలగొట్టారో, అక్కడే తిరిగి పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ఆస్తి నష్టానికి గానూ ఒక్కో కుటుంబానికి ₹3 లక్షల తక్షణ నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని, బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని స్పష్టం చేశారు.
Also Read: Modern Love Story: భార్య కోసం తాజ్ మహల్ కట్టేసిన భర్త, నిజంగా నువ్ గ్రేట్ భయ్యా!