తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ‘సోషల్ మీడియా’ వార్ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే స్థాయిలో ధీటుగా బదులిస్తున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచాయి. అసలు కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఏమని ట్వీట్ చేశారు..? దీనికి కాంగ్రెస్ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతన్నారు..? అనే దాని గురించి మనం క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ సర్కారు విచారణల పేరిట సిట్ (SIT) డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అక్రమాలను ఎండగడుతూ ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ఒక మంత్రి పీఏ, రేవంత్ సహచరుడు కలిసి పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరించి రూ. 300 కోట్లు డిమాండ్ చేసినా ఎందుకు సిట్ వేయలేదని ప్రశ్నించారు. ములుగులో ఇసుక దందా, రెవెన్యూ మంత్రి కుమారుడి భూకబ్జా ఆరోపణలు, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కాంట్రాక్టర్ను బెదిరించిన ఘటనలపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని కేటీఆర్ నిలదీశారు.
లిక్కర్ హోలోగ్రామ్ టెండర్లు, చీప్ లిక్కర్ కంపెనీలకు అనుమతులు, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో బెడ్ల కొనుగోలు కుంభకోణం వంటి అంశాల్లో వందల కోట్ల అవినీతి జరిగినా విచారణ ఊసే లేదని కేటీఆర్ విమర్శించారు. సుప్రీంకోర్టు కమిటీ తప్పుబట్టిన 400 ఎకరాల వర్సిటీ భూముల విక్రయంపై కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేవలం సోషల్ మీడియా హ్యాండిల్స్, డిజిటల్ మీడియాపై వేధింపుల కోసమే సిట్ను వాడుకుంటున్నారని.. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కేటీఆర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. కాళేశ్వరం నుంచి ధరణి వరకు ప్రతి పథకంలోనూ స్కామ్లు ఉన్నాయని వారు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రైతులు, నిరుద్యోగులు దారుణంగా మోసపోయారని ఫైర్ అవుతున్నారు. ఆ పాపాలను కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ.. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మరింత భారీ మూల్యం తప్పదని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించాయి. విచారణలు పారదర్శకంగా జరుగుతుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని వారు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు ప్రతిదాడులతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో.. విచారణలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూద్దాం మరీ..
పాలనా వైఫల్యాల నుండి దృష్టి మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం తరచూ చేసే అటెన్షన్ డైవర్షన్ డ్రామాలే
విచారణల పేరిట కమిషన్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముల (సిట్) ఏర్పాటు!
👉🏽 కాంగ్రెస్ సర్కారులో సాక్షాత్తూ ఒక మంత్రి గారి PA, రేవంత్ సహచరుడు కలిసి
ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకి పెట్టి…— KTR (@KTRBRS) January 13, 2026
ALSO READ: Mahesh Kumar: సీఎంకు నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. అవన్నీ వట్టి ముచ్చట్లే: మహేష్ కుమార్ గౌడ్