KTR: స్వేచ్ఛ, బ్యూరో: మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతుందని, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత కే.టి.రామారావు అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను అనుమతించారు. దీంతో మూసీ నదిపై కేటీఆర్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మా రెడ్డి లు సమర్పించిన ప్రశ్నపై కేటీఆర్ మాట్లాడుతూ డీపీఆర్ రూపకల్పన, ఇళ్ల కూల్చివేతలు, భూసేకరణ, ప్రాజెక్ట్ వ్యయం పెంపు, ప్రభుత్వం చేస్తున్న విభిన్న ప్రకటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి కలిసి మూసీ ప్రాజెక్టుపై తమ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: KTR: డ్రగ్స్ టెస్ట్కు నేను రెడీ అని చెప్పా.. మరి ఏమైంది?, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మొత్తం రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఒకవైపు లక్షన్నర కోట్లు అని ప్రకటించగా, సభలో మాత్రం నాలుగు, ఐదు వేల కోట్ల రూపాయలని చెప్పడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టును ఎన్ని దశల్లో అమలు చేస్తారు? ఎంత భూసేకరణ జరుగుతుంది? ఎన్ని ఇళ్లు కూల్చివేస్తారు ? అనే విషయాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. గెజిట్ ప్రకారం 10 వేల పైగా ఇళ్లను కూల్చివేయనున్నట్లు సర్కారు ప్రకటించగా, 3,260 ఎకరాల భూమి సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. బఫర్ జోన్ను విస్తరించామని స్థానిక ఆర్డీఓ వెల్లడించారని, అసలు బఫర్ జోన్ ఎంత వరకు పెంచారో? దానికి ప్రమాణాలు ఏమిటో? ప్రభుత్వం వివరించాలన్నారు. మూసీ ప్రాజెక్ట్ పేరిట ప్రజల ఆస్తులు, ఇళ్లు, జీవనోపాధిపై దెబ్బతీసే చర్యలను బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని, పారదర్శకత లేకుండా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద డీపీఆర్ ఉందా? లేదా? అన్న విషయానికి స్పష్టమైన సమాధానం లేదని విమర్శించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సైతం డీపీఆర్ లేదని చెబుతున్నారని తెలిపారు.
ఎన్ని ఇళ్లు కూల్చివేస్తున్నారు అనే విషయానికీ ప్రభుత్వం సరైన వివరాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రజెంటేషన్లు చేయకుండా, బాధితులతో ప్రజల మధ్యే ప్రజెంటేషన్ ఇవ్వాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ హాజరుకాలేదని స్పష్టం చేశారు. మూసీ నదిని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టేనని ఆయన ఆరోపించారు. ఇప్పుడు అదే పార్టీ ప్రజల పేరుతో భారీ ప్రాజెక్ట్ పేరుతో అవినీతి చేయాలని చూస్తోందన్నారు. ప్రభుత్వం వద్ద డీపీఆర్ ఉంటే వెంటనే సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మూసీకి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్కు నోటీసులు ఇవ్వడం మూసీపై ప్రభుత్వం వద్దనే క్లారిటీ లేదనేందుకు నిదర్శనంగా కేటీఆర్ పేర్కొన్నారు. మొదట 1400 ఇళ్లు కూల్చివేస్తామని చెప్పి, ప్రస్తుతం 10 వేల ఇళ్లకు పైగా ఎఫెక్టు అవుతున్నాయంటూ నోటీసులివ్వటం ఏమిటోనని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వద్ద నిధులు లేవని, సరైన ప్రణాళిక లేదని, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) లోన్ కూడా లేదని కేటీఆర్ తెలిపారు. మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్ తయారీని మెయిన్ హార్ట్ అనే సంస్థకు అప్పగించారని, ఈ కంపెనీని సింగపూర్, పాకిస్తాన్, భారతదేశంలోని అనేక సంస్థలు బ్యాన్ చేశాయని తెలిపారు. గతంలో ఇదే అసెంబ్లీలో డీపీఆర్ రూపకల్పనకు కనీసం 18 నెలలు సమయం పడుతుందని చెప్పి, ఇప్పుడు కేవలం రెండు నెలల్లో డీపీఆర్ సిద్ధమైందని చెప్పటం అనుమానంగా ఉందన్నారు. అద్భుతమైన డీపీఆర్ తయారు చేసి ఉంటే, దాన్ని సభలో, ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి అంగీకరించిందని మంత్రి శ్రీధర్ బాబు సభలో చెప్పారని, కానీ బ్యాంక్ అధికారులను సంప్రదించగా జనవరి 23 నాటికి ఎలాంటి డీపీఆర్ తమకు అందలేదని, రుణంపై ఎలాంటి అంగీకారం లేదని స్పష్టం చేశారని కేటీఆర్ తెలిపారు. మార్చి 11న కూడా అదే విషయాన్ని ఏడీబీ మరోసారి స్పష్టం చేసిందంటూ మూసీ ముసుగులో జరుగుతున్న దోపిడీని మేం వ్యతిరేకిస్తున్నామని, ఇందుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి, భయటకు వెళ్లిపోయారు.
Also Read: Seethakka Slams KTR: మహిళలకు ఫ్రీ బస్సు పెడితేనే ఓర్వడం లేదు.. కేటీఆర్పై మంత్రి సీతక్కఫైర్!