ప్రస్తుత సమాజంలో యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సమాచారం క్షణాల్లో చేరవేసే సోషల్ మీడియా అకౌంట్స్ ఇప్పుడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్ ఫేక్ వీడయోల వల్ల సోషల్ మీడియాలో ఏది వాస్తవమో, ఏది కల్పితమో గుర్తించడం సామాన్యులకు కష్టతరంగా మారింది. నిజమైన వ్యక్తుల గొంతును, ముఖ కవళికలను అచ్చుగుద్దినట్లుగా మార్చేసి సృష్టిస్తున్న ఈ చెత్త కంటెంట్ వల్ల సమాజంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ డీప్ ఫేక్ వీడియోల కారణంగా పలువురు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఐటీ నిబంధనలను సవరించడం ద్వారా కంటెంట్ నియంత్రణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది. ఇప్పటివరకు ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ ను లేదా పోస్ట్ను నిలిపివేయాలంటే ఐటీ మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండేది. ఇకపై ఆ అవసరం లేకుండానే మరో నాలుగు కీలక మంత్రిత్వ శాఖలకు స్వతంత్ర అధికారాలు లభించనున్నాయి. కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సమాచార ప్రసార శాఖలు నేరుగా బ్లాకింగ్ ఆర్డర్లు జారీ చేయవచ్చు.
దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశాలపై తక్షణమే స్పందించేందుకు ఈ మార్పులు దోహదపడతాయి. తప్పుడు సమాచారం ప్రచారాన్ని అడ్డుకోవడంలో జాప్యాన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని అధికారులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించే డీప్ఫేక్ వీడియోలు దేశ శాంతిభద్రతలకు సవాలుగా మారుతున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఐటీ శాఖ ఆమోదం కోసం వేచి చూడటం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకే సంబంధిత శాఖలకు నేరుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు.
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను కఠినంగా పాటించాల్సి ఉంటుంది. సాధారణ తప్పుడు సమాచారం లేదా అభ్యంతరకర పోస్టులను మూడు గంటల వ్యవధిలోనే తొలగించాలి. ముఖ్యంగా డీప్ఫేక్ పోర్నోగ్రఫీ వంటి అత్యంత సున్నితమైన అంశాల్లో కేవలం రెండు గంటల సమయం మాత్రమే కేటాయించారు. నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోని పక్షంలో ఆయా సంస్థలు చట్టపరమైన రక్షణను కోల్పోతాయి. దీనివల్ల ఫేస్బుక్ ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తుంది.
ఆ నాలుగు శాఖలు ఇవే..
హోం మంత్రిత్వ శాఖ
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రక్షణ శాఖ
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులు సైతం ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం తమ విధులను కొనసాగించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెరగడం వల్ల కంటెంట్ తొలగింపు ప్రక్రియ సులభం అవుతోంది. తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టడం ద్వారా డిజిటల్ భద్రతను పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టెక్నాలజీ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తమ వ్యవస్థలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇది ఇంటర్నెట్ వినియోగదారుల భద్రతను మెరుగుపరచడంతో పాటు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై పదునైన అస్త్రంగా మారనుంది.