KTR: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితం బీఆర్ఎస్ (BRS) పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటమి పాలు కావడం కేవలం అభ్యర్థి పరాజయం మాత్రమే కాదని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంపైనా, పోల్ మేనేజ్మెంట్పైనా కార్యకర్తల్లో తీవ్రమైన అసంతృప్తికి దారి తీసింది. స్వయంగా తానే బరిలో ఉన్నంత స్థాయిలో కేటీఆర్ ప్రచారం నిర్వహించినప్పటికీ.. పార్టీ విజయం సాధించలేకపోవడం బీఆర్ఎస్ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. ఈ ఓటమి కేటీఆర్కు పార్టీని నడిపే సామర్థ్యం లేదనే విషయాన్ని మరోసారి రుజువు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేటీఆర్ ఫెయిల్యూర్
ఈ ఉపఎన్నిక సందర్భంగా కేటీఆర్ వ్యవహరించిన తీరుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. సుదీర్ఘ కాలం పాటు పార్టీలో ఎవరినీ ఎదగనీయకుండా నియంతలా వ్యవహరించారనే అపవాదును ఎదుర్కొంటున్న కేటీఆర్, ఈ ఉపఎన్నిక ద్వారా అనధికారికంగా పార్టీ నాయకత్వ పగ్గాలు చేజిక్కించుకునే ప్రయత్నం చేశారనే వాదన ఉంది. అయితే.. ఆయన తీవ్రంగా ప్రచారం చేసి, పోల్ మేనేజ్మెంట్లో స్వయంగా పాలుపంచుకున్నప్పటికీ చివరకు బొక్కబోర్ల పడటంతో.. పార్టీపై ఆయన పట్టు బలహీనపడిందనే చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. ఈ ఫలితం, పార్టీ కార్యకర్తలు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదనే విషయాన్ని తేటతెల్లం చేసిందని పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అంతర్గతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
సంచలన ఆరోపణలు చేసినా దక్కని విజయం
ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై పలు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, యూసుఫ్ గూడా ప్రాంతంలో కాంగ్రెస్ దొంగ ఓట్లకు పాల్పడుతోందని, కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను రౌడీ అని చిత్రీకరిస్తూ.. ఆయనకు ఓట్లు వేయవద్దని తెగ ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతేకాక, సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించి విస్తృత ప్రచారం చేసినప్పటికీ.. ఆ దూకుడు ఎన్నికల్లో విజయానికి దారితీయకపోవడం గమనార్హం.
హైదరాబాద్ లో పట్టు కోల్పోతున్న బీఆర్ఎస్
ఈ ఎన్నికల ఫలితంతో కేటీఆర్ నాయకత్వ సామర్థ్యంపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. ఈ విజయం అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ కోల్పోతున్న పట్టును ఈ ఉపఎన్నిక మరింత స్పష్టం చేసింది. ఈ ఓటమి కేవలం అభ్యర్థి మాగంటి సునీతకు మాత్రమే కాదని, బీఆర్ఎస్ పార్టీని నడిపించే విషయంలో కేటీఆర్కు ఉన్న సామర్థ్యంపైనా, ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలపైనా కార్యకర్తల్లో అనుమానాలు పెరిగేలా చేసిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇకనైనా పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యతను గుర్తించి, అందరినీ కలుపుకొని పోయే నాయకత్వ ధోరణిని అలవర్చుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ పరాజయం బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తులో మరిన్ని అంతర్గత చర్చలకు, మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేసీఆర్ లేకుంటే అంతేనా..?
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఘోర పరాజయం పాలవ్వడం, కాంగ్రెస్ అభ్యర్థి 24 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలవడం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంపై తీవ్ర ప్రభావం చూపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్లోని ఈ కీలక స్థానాన్ని కోల్పోవడం బీఆర్ఎస్కు పెద్ద ఎదురుదెబ్బ. కేసీఆర్ (KCR) దూరంగా ఉండటం, కేటీఆర్ ఒక్కరే ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో.. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ రాజకీయాల్లో రాణించలేరా? అనే చర్చ మొదలైంది. తండ్రి లేని లోటు, సంస్థాగత బలహీనతలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఈ ఫలితానికి కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫలితం తర్వాత పార్టీని పునర్నిర్మించాల్సిన తక్షణ కర్తవ్యం కేటీఆర్ ముందు ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు.