Bhadrachalam LIC: స్వేచ్ఛ బ్యూరో: భద్రాచలం ఎల్.ఐ.సి. శాఖలో భారీ కుంభకోణం కలకలం రేపుతోంది. బతికుండగానే డెత్ సర్టిఫికెట్లు సృష్టించి కొందరు ఏజెంట్లు రూ.1.52 కోట్లు భీమా సొమ్ము కాజేశారు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు తో ఈ స్కామ్ వెలుగు చూసింది. భద్రాచలం ఎల్ఐసీలో గతంలోనూ స్కామ్ లు జరిగాయనే విమర్శలున్నాయి.
ఎల్ఐసీ బ్రాంచ్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరపకపోవడంతో వారి అండదండలున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. నకిలీ పత్రాలతో ఇన్సూరెన్స్ తీసుకుని ఆపై వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి నిధులు కాజేసిన ఘరానా మోసం ద్వారా రూ.1.52 కోట్లను కాజేసిన ఉదంతం వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన కొంతమంది ఏజెంట్లు ఓ ముఠాగా ఏర్పడి ఎల్ఐసీ నిబంధనల్లో లొసుగులను ఆసారాగా చేసుకున్నారని, పేదల పేరిట నకిలీ పత్రాలతో పాలసీలు తీసుకున్నారని అనంతరం వారు చనిపోయినట్లుగా తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి కోటిన్నర రూపాయలకు పైగా కాజేశారని సమాచారం. క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సిన భద్రాచలం ఎల్.ఐ.సి. శాఖలోని అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read: Ganja Bhang Seized: గంజాయి ‘బంగ్’ కలకలం.. హోలీ పూట మత్తు చిమ్ముతున్న ముఠా అరెస్ట్..
ఆలస్యంగా నిద్రలేచిన శాఖ అధికారులు అంతా అయిపోయి, ఎల్ఐసి ఖజానా ఖాళీ అయ్యాక గానీ బ్రాంచ్ నిర్వాహకులకు విషయం బోధపడలేదు. అంతర్గత తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడటంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంత భారీ మొత్తంలో నగదు పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు గుర్తించలేక పోయారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. భద్రాచలం బ్రాంచ్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో పాలసీదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్రాంచ్ అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరగడం సాధ్యమేనా? నకిలీ పత్రాలు వెరిఫై చేయడంలో సిబ్బంది ఎందుకు విఫలమయ్యారు? సాధారణ ప్రజలకు క్లెయిమ్ రావాలంటే నెలల తరబడి తిప్పించే అధికారులు, ఈ కేటుగాళ్లకు ఎలా సహకరించారు? అనే పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Hyderabad Fire Accident: హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం.. బాచుపల్లిలో దగ్ధమైన ఫర్నిచర్ షాపు