Maganti Gopinath: జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారసత్వానికి సంబంధించిన కుటుంబ వివాదం రేపు మరోసారి విచారణకు రానుంది. శేర్లింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో రెవెన్యూ అధికారులు ఇరువర్గాల వాదనలను, వారు సమర్పించే కీలక పత్రాలను పరిశీలించనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో తెరపైకి వచ్చిన ఈ అంశం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
ఈ వివాదానికి ప్రధాన కారణం.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రెండో భార్యగా చెబుతున్న మాగంటి సునీత ‘ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్’ (FMC) పొందడమే. ఈ సర్టిఫికెట్ తీసుకున్న నేపథ్యంలోనే కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి, సునీతపై తీవ్ర ఆరోపణలు చేశారు. గోపీనాథ్ మొదటి భార్య మరియు ఆమె కుమారుడికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ వివాదంపై నవంబర్ 6వ తేదీన శేర్లింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో రెవెన్యూ అధికారులు తొలి విచారణ చేపట్టారు. ఆ విచారణకు మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి, మొదటి భార్య మాలిని దేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ హాజరయ్యారు. మరోవైపు, మాగంటి సునీత తరపున ఆమె చిన్న కూతురు దీశిరా మరియు అడ్వాకేట్ హాజరయ్యారు. ఇరువర్గాలు తమ వాదనలను అధికారుల ముందు వినిపించారు.
నవంబర్ 6న జరిగిన విచారణ అనంతరం, రేపు (నవంబర్ 25) ఎమ్మార్వో కార్యాలయంలో మరోసారి విచారణ జరగనుంది. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఇరువర్గాలు తమ తమ వాదనలకు మద్దతుగా ఉన్న కీలకమైన డాక్యుమెంట్లను ఎమ్మార్వోకు సమర్పించనున్నారు. ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రెవెన్యూ అధికారులు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు చట్టబద్ధమైన వారసులుగా ఎవరు ఉంటారు, ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ ఎవరికి చెందుతుంది అనే అంశాలు రేపటి విచారణ అనంతరం తేలే అవకాశం ఉంది. ఉపఎన్నికల వేళ సంచలనంగా మారిన ఈ కుటుంబ వివాదంలో రెవెన్యూ అధికారులు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో అని రాష్ట్ర ప్రజానీకం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది