Mahesh Kumar: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మహిళలను దారుణంగా మోసం చేస్తోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. అసలు ఈ బిల్లును అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రధాని మోదీకి లేదని, అందుకే కావాలనే ఇందులో ‘డీలిమిటేషన్’ అనే మెలిక పెట్టారని ఆయన విమర్శించారు. ఒకవేళ 2023లోనే చిత్తశుద్ధితో బిల్లు పాస్ చేసి ఉంటే, ఈపాటికే 2024 ఎన్నికల్లో మూడో వంతు మహిళలు చట్టసభల్లో ఉండేవారు కదా అని ప్రశ్నించారు. కేవలం దక్షిణాది రాష్ట్రాల సీట్లను తగ్గించి, ఉత్తరాదికి మేలు చేసేలా అశాస్త్రీయంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను బీజేపీ వాడుకోవాలని చూస్తోందని, దీనిని కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, సోనియా గాంధీలు సమర్థవంతంగా అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు.
బిజెపికి మహిళలపై గౌరవం లేదని చెప్పడానికి వారి పార్టీ చరిత్రే సాక్ష్యమని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. దేశానికి తొలి మహిళా ప్రధానిని, స్పీకర్ను, రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, కానీ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రే లేని బీజేపీ ఇంతవరకు ఒక్క మహిళను కూడా జాతీయ అధ్యక్షురాలిని చేయలేదని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ వంటి అనుబంధ సంస్థల్లో మహిళలకు చోటు ఎక్కడ ఉందని ఆయన నిలదీశారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారని, అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడే బీజేపీ ఎంపీలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను పాకిస్థాన్తో పోల్చినప్పుడు ఇక్కడి బీజేపీ ఎంపీలకు బుద్ధి లేదా అని ప్రశ్నించారు. అలాగే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కిషన్ రెడ్డి ఒక్క బీసీ నాయకుడినైనా ఎదిగించారా అని నిలదీస్తూ.. తన హయాంలో రాష్ట్రానికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. పులి కష్టం ఫామ్ హౌస్కే పరిమితమైంది’ అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిని, ‘పులి తిన్న మేకల’ కథను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ప్రజలు ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటున్నారని, రాముడి పేరు చెప్పి రాజకీయం చేసే కాలం పోయిందని ఆయన స్పష్టం చేశారు.
Also Read: మామ తర్వాత సీఎం కావాలనుకున్నారు.. కానీ ప్రజలు కల చెరిపేశారు.. హరీష్ తీరుపై చామల ఎద్దేవా!
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం మోడీ నాయకత్వానికి చెంపపెట్టు లాంటిది: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఎంత పెద్ద నాయకుడైనా అహంకారంతో ఒంటెద్దు పోకడలకు పోతే ప్రజాస్వామ్య వ్యవస్థ అడ్డుతగులుతుంది
ఇందుకు నిన్న బిల్లు వీగిపోవడమే నిదర్శనం
ఉత్తర భారత దేశానికి అధిక సీట్లు, దక్షిణ… pic.twitter.com/MSQyzlixqX
— BIG TV Breaking News (@bigtvtelugu) April 18, 2026