Mahesh Kumar: బీజేపీ తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు కావాలనే రచ్చ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం కేవలం ఒక సామెత తరహాలో మాట్లాడారని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మహేశ్ కుమార్ గౌడ్ ఈ వివాదాన్ని అనవసర రాద్దాంతంగా అభివర్ణించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ) అంశంలో కూడా కొందరు ఇలాంటి అనవసరపు రాద్ధాంతమే చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ పెద్దవి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ విమర్శించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ హిల్ట్ (HILT) పాలసీ గురించి కూడా ప్రస్తావించారు. ఈ నూతన విధానంపై విమర్శలు చేయడం దారుణం అని ఆయన అన్నారు. ఢిల్లీ రాష్ట్రంలో నెలకొన్న విధంగా పాలనలో సమస్యలు, చిక్కుముడులు ఇక్కడ తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఈ హిల్ట్ పాలసీని తీసుకొచ్చామని మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, పాలన సజావుగా సాగడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ విధానం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కేవలం విమర్శల కోసమే విమర్శలు చేయడం సరికాదని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
మొత్తంగా, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నుండి హిల్ట్ పాలసీ దాకా.. ప్రతి విషయంలోనూ బీజేపీ నాయకులు రాజకీయ అజెండాతోనే వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల్లో లభిస్తున్న ఆదరణను తట్టుకోలేక, చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని మహేశ్ కుమార్ గౌడ్ హితవు పలికారు.
ALSO READ: SBI: ఎస్బీఐలో 996 ఉద్యోగాలు.. రూ.44 లక్షల జీతం, ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్