Bogatha Waterfalls: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడం, రోడ్లు జలమయం అవుతున్నాయి. తాజాగా పర్యాటక ప్రాంతం బొగత జలపాతం వరద ఉధృతంగా అమాంతంగా పెరిగింది. దీంతో టూరిస్టుల సందర్శనను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.
బొగత జలపాతం ఉగ్రరూపం- వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీని కారణంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జలశ్రయాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహించడం మొదలైంది. గడిచిన 10 గంటలుగా వర్షాలు పడుతుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరింది. ఫలితంగా జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో జలపాతాలను చూసేందుకు పర్యాటకులు అధికంగా వస్తున్నారు. పరిస్థితి గమనించిన అధికారులు, భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టారు.
సందర్శన నిలిపివేత-బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ములుగు జిల్లాలోని చీకుపల్లి వద్ద ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రతీ రోజూ వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. వరసగా వర్షాల వల్ల రాళ్లు జారడం మొదలైంది. నీటి ప్రవాహం హెచ్చుతగ్గులకు లోనుకావడం గమనించారు అధికారులు. దీనివల్ల ప్రమాదం జరగవచ్చని అంచనా వేశారు. వరద ఉధృతి అదుపులోకి వచ్చేవరకు పర్యాటకులు ఎవరు జలపాతం వైపు రావొద్దని సూచన చేశారు. పోలీసులు-అటవీ శాఖ అధికారుల ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. జలపాతం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు.
ALSO READ: స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ హైలెవల్ మీటింగ్!
ఏళ్ల చరిత్ర కలిగిన చెట్లు నేలమట్టం- మరోవైపు ములుగు జిల్లాలోని సండ్రోనిఒర్రె వద్ద మంగళవారం సాయంత్రం టోర్నడోను తలపించేలా భయంకరమైన సుడిగాలి బీభత్సం సృష్టించింది. కోమటిపల్లి వెళ్లే మార్గంలోని శాంతినగర్, గొత్తికోయగూడెం ప్రాంతానికి ఇరువైపులా పది ఎకరాల విస్తీర్ణంలో దట్టంగా ఉన్నభారీ వృక్షాలు నెల కొరిగాయి. దాదాపు 20కి పైగా చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. వీటిని అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని మంగపేట రేంజ్ అధికారి తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. రెండేళ్ల కిందట మేడారం వెళ్లే ప్రధాన రోడ్డు వెంట అటవీ ప్రాంతంలో బలమైన గాలులకు భారీ వృక్షాలు నేల కొరిగిన విషయం తెల్సిందే. అప్పుడు తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ తరహా గాలులు వీచినట్టు అధికారులు చెబుతున్నారు.