Ganja Seized: గంజాయి వాసన రోజురోజుకు గుప్పుమంటోంది. ఒడిశా నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న మఠాను పట్టుకున్నారు పోలీసులు. రెండు కేసుల్లో 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి ఇద్దరు గంజాయి తీసుకొచ్చారని, రెండు చోట్ల అమ్మకాలు జరిపారని సమాచారం మేరకు పోలీసు అధికారి అంజిరెడ్డి బృందం రెండు చోట్ల దాడులు నిర్వహించింది. పది కిలోల చొప్పున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గంజాయి పోలీసుల కంట పడకూడని రోహన్ సింగ్ అనే వ్యక్తి 10 కిలోల గంజాయిని పూజ గదిలో దేవుళ్ళ ఫోటో వెనుక పెట్టాడు. ఎప్పట్లాగే దేవుడి గదిలో ప్రత్యేక పూజలు సైతం చేశాడు. ఇంట్లో ఎక్కడా గంజాయి దొరక్కపోవడంతో.. చివరగా పూజగదిని పరిశీలించారు పోలీసులు. దీంతో గుట్టు రట్టైంది.
దూల్పేట్లోని శివలాల్ నగర్ లో సంకీర్ సింగ్, సుశీల్ సింగ్, సరితా, స్వప్న మండల్ అలియాస్ మీనా భాయ్ వద్ద 10కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు.
తెలంగాణలోని పలుచోట్ల ఎక్సైజ్ అధికారులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని ఓ షాపులో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి పది కిలోల గంజాయి పట్టుకున్నారు. దీంతోపాటు గంజాయితో తయారు చేసిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి ఐదు లక్షల విలువైన గంజాయి పట్టుకున్నట్లు వెల్లడించారు అధికారులు.
సూర్యాపేట జిల్లాలోనూ పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోదాడలోని దొరకుంట గ్రామ శివార్లలో గంజాయి దాచారన్న సమాచారంతో రైడ్ నిర్వహించారు పోలీసులు. ఈ దాడుల్లో సుమారు మూడు లక్షల విలువ చేసే గంజాయితోపాటు 2 సెల్ఫోన్స్ పట్టుకున్నారు. ఒడిషా నుంచి తీసుకొచ్చి ఇక్కడ గంజాయి అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మరోవైపు హైదరాబాద్ శివారులోని నార్సింగిలో.. పోలీసులు భారీ మొత్తంలో హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో.. శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు.. నార్సింగి దగ్గర మాటు వేసి.. 650 గ్రాముల హెరాయిన్ని పట్టుకొని సీజ్ చేశారు. దీని విలువ.. కోటిన్నర దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓ బ్యాగులో హెరాయిన్ తీసుకొస్తున్న వ్యక్తిని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర పట్టుబడిన హెరాయిన్.. గోధుమ రంగులో ఉంది. దీనిని.. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
హెరాయిన్తో పట్టుబడిన వ్యక్తిని.. పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆశ్చర్యపోయే సమాధానాలు చెప్పాడు. ఇంతమొత్తంలో హెరాయిన్ నీ దగ్గర ఎందుకు ఉందని అడిగితే.. తానే హెరాయిన్ వినియోగిస్తున్నానని చెప్పాడు. దాంతో.. అతనిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు.. ఇంత భారీ మొత్తంలో ఇతనికి హెరాయిన్ ఎందుకు అమ్మారు? అన్నదే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. పోలీసులకు పట్టుబడిన వ్యక్తి.. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని అతనే ఒప్పుకున్నాడు. కానీ.. 650 గ్రాముల హెరాయిన్ అతనొక్కడే తీసుకోగలడా? ఇంతమొత్తంలో ఒక్కడికే ఎందుకు అమ్మాల్సి వచ్చిందనే దానిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇతని ద్వారా హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్నారా? లేక.. సిటీలో హెరాయిన్ సప్లై చేసే నెట్వర్క్లో ఇతను కూడా భాగమా? అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.’
Also Read: జూరాల ప్రాజెక్ట్కు భారీగా వరద.. 14 గేట్లు ఎత్తి నీటి విడుదల
సాధారణంగా ఎవరి దగ్గరైనా డ్రగ్స్ పట్టుబడితే.. ఓ 20 గ్రాములో, 50 గ్రాములో.. మహా అయితే వంద గ్రాములో పట్టుబడుతుంది. కానీ.. నార్సింగి డ్రగ్స్ కేసులో.. ఒక్కడి దగ్గరే 650 గ్రాములు దొరికింది. పైగా.. తాను సేవించేందుకే తెచ్చుకున్నానని చెప్పడంతోనే.. తేడా కొడుతోంది. అసలు.. ఈ హెరాయిన్ వెనకున్న కింగ్ పిన్ ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇతనికి హెరాయిన్ అమ్మిన వ్యక్తిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అతని కోసం కూడా గాలిస్తున్నారు. ఈమధ్యకాలంలో.. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పట్టుబడుతున్న డ్రగ్స్ మూలాలు రాజస్థాన్లో తేలుతున్నాయ్. దాంతో.. పోలీసులు రాజస్థాన్పై ఫోకస్ పెట్టారు. త్వరలోనే.. ఈ రాజస్థాన్ డ్రగ్ నెట్వర్క్ని ఛేదించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.