Inter Practical Exams: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షల్లో సామూహిక కాపీయింగ్ దందా వెలుగులోకి వచ్చింది. కమాండ్ కంట్రోల్ రూమ్ లైవ్ సీసీటీవీ నిఘా ఆధారంగా పలు కాలేజీల్లో జరుగుతున్న అక్రమాలను బోర్డు గుర్తించింది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా పాల్గొన్న 16 మంది ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు, ల్యాబ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ఇంటర్ బోర్డు ఆదేశించింది.
ఈనెల 2, 3, 4 తేదీల్లో జరిగిన ప్రాక్టికల్ పరీక్షల్లో పలు ఉల్లంఘనలు రికార్డయినట్లు బోర్డు స్పష్టంచేసింది. కొందరు ఎగ్జామినర్లు స్వయంగా విద్యార్థులకు ఆన్సర్ స్లిప్పులు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. బాధ్యతగల ఎగ్జామినర్లు కావాలనే పరీక్ష హాళ్లను ఖాళీగా వదిలి, బయటి మెటీరియల్ లోపలికి అనుమతించారని తెలిపారు. ఇక కొన్ని కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్న సమయంలోనే సీసీటీవీ కెమెరాలు ఆఫ్ లైన్ లేదా బ్లింక్ అయ్యాయని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని అధికారులు నిర్ధారించారు. అంతేకాకుండా ఇతరులు పేపర్లు మూల్యాంకనం చేయడం, పరీక్ష ముగియకముందే మార్కులు వేయడం వంటి అక్రమాలు వెలుగుచూశాయని వివరించారు. ఈ వ్యవహారంపై బోర్డు జీరో టాలరెన్స్ పాలసీని అమలు చేస్తోంది.
Also Read: Euphoria Movie: ‘యుఫోరియా’ స్పెషల్ ప్రీమియర్ చూసి ఎమోషనల్ అయిన భూమిక.. ఏం చేశారంటే?
అక్రమాలకు పాల్పడిన సిబ్బందికి ఎలాంటి జీతభత్యాలు, టీఏ, డీఏ చెల్లించబోమని స్పష్టంచేసింది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇంటర్ బోర్డు నిర్వహించే అన్ని పరీక్షా విధుల(ప్రాక్టికల్, థియరీ) నుంచి వారిని శాశ్వతంగా డీబార్ చేసినట్లు స్పష్టంచేసింది. మిగిలిన పరీక్షలకు అంతరాయం కలగకుండా రిజర్వ్ సిబ్బందిని నియమించాలని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు బోర్డు ఆదేశించింది. బోర్డు తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో పరీక్ష కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో భయాందోళన నెలకొంది. ఇదిలా ఉండగా మాస్ కాపీయింగ్ కు పాల్పడిన ఆయా సెంటర్లకు తొలి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోసారి రిపీట్ అయితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. సెంటర్ ను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read: Honda Shine 125: హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?