MS College Malakpet: హైదరాబాద్ నగరంలోని మలక్పేట్ ప్రాంతంలో ఉన్న ఎంఎస్ కాలేజీలో.. పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ ఘటన కలకలం రేపింది. పరీక్షలు జరుగుతున్న తరగతుల్లోనే పుస్తకాలు, నోట్బుక్స్, మొబైల్ ఫోన్లు ముందుపెట్టుకొని విద్యార్థులు నిర్భయంగా కాపీయింగ్కు పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.
సమాచారం ప్రకారం.. వార్షిక పరీక్షలు జరుగుతున్న సమయంలో పలువురు విద్యార్థులు తమ సీట్లపైనే పుస్తకాలు తెరిచి పెట్టుకొని పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ ఫోన్లలోని నోట్స్ను చూసుకుంటూ జవాబులు రాసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదే సమయంలో పరీక్షా కేంద్రానికి స్పెషల్ స్క్వాడ్ రానున్నారనే సమాచారం వచ్చింది. అంతే పరీక్ష హాల్స్లో కాపీయింగ్లో మునిగిపోయిన విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పట్టుబడితే భవిష్యత్ మొత్తం తలకిందులు అవుతుందన్న భయంతో కొందరు విద్యార్థులు హడావుడిగా తమ నోటుబుక్స్, చీట్స్, స్లిప్స్ను కిటికీల ద్వారా బయటకు విసిరేశారు. కొంతమంది అయితే పరీక్ష హాల్ గేట్ల వద్దనే స్లిప్స్ను పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
రోడ్డుపై పడి ఉన్న పుస్తకాలు, స్లిప్స్తో అక్కడి దృశ్యం కాసేపు కల్లోలంగా మారింది. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులపై, పాదచారులపై ఈ కాగితాలు పడటంతో వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్కడి నుంచి ఇవన్నీ పడుతున్నాయో అర్థం కాక కొంతసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
స్క్వాడ్ బృందం కాలేజీకి చేరుకున్న తర్వాత పరీక్షా హాల్లను తనిఖీ చేయగా, కొందరు విద్యార్థుల వద్ద చీట్స్, చేతిరాత నోట్స్ దొరికినట్లు సమాచారం. సంబంధిత అధికారుల ఆదేశాలతో పట్టుబడిన విద్యార్థుల నుంచి సమాధాన పత్రాలు స్వాధీనం చేసుకొని, వారి హాజరు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Also Read: తీవ్ర జ్వరంతో గంటల వ్యవధిలో.. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చిన్నారులు మృతి
ఈ ఘటనపై విద్యా శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. పరీక్షల పవిత్రతను భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. మాస్ కాపీయింగ్కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే వారి పరీక్షలను రద్దు చేయడంతో పాటు భవిష్యత్తు పరీక్షలకు కూడా అనర్హులుగా ప్రకటించే అవకాశమున్నట్లు అధికారులు హెచ్చరించారు. అలాగే పరీక్ష పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.