Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్లో నిత్యం వేలాది వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే హైటెక్ సిటీ ప్రధాన రహదారిపై ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడం నగరవాసులను ఆందోళనకు గురిచేసింది. ఐకియా నుండి జేఎన్టీయూ వైపు వెళ్లే మార్గంలోని సైబర్ గేట్వే సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఐకియా నుండి జేఎన్టీయూ వెళ్లే మార్గంలో రోడ్డు కుంగుబాటు..
భారీ స్థాయిలో రోడ్డు కుంగిపోయి లోతైన గొయ్యి ఏర్పడటంతో, ఆ సమయంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగిన సమయంలో వాహనాలేవీ ఆ గొయ్యిలో పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఐటీ కారిడార్లో భారీగా ట్రాఫిక్ జామ్
ఈ హఠాత్ పరిణామంతో ఐకియా-సైబర్ టవర్స్ మధ్య కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి, కుంగిన ప్రాంతం చుట్టూ బారికేడ్లు సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా మారిన ఆ మార్గంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నియంత్రించి, ఇతర మార్గాల్లోకి మళ్లించారు. ఆఫీసు వేళలు కావడంతో ఐటీ ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది.
మురుగునీరు లీక్ కావడం వల్లే రోడ్డు కుంగిందని అనుమానం..
అయితే ప్రాథమిక విచారణ ప్రకారం, రహదారి కింద ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ లీకేజీ అవ్వడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. మురుగునీరు నిరంతరం లీక్ అవ్వడం వల్ల భూమి లోపల మట్టి మెత్తబడి, లోపలి భాగం డొల్లగా మారి పైన ఉన్న రహదారి పట్టు కోల్పోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భారీగా కురిసిన వర్షాల వల్ల కూడా పైపులపై ఒత్తిడి పెరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఐటీ కారిడార్ వంటి కీలక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: నేడు గుజరాత్ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
కుంగిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టిన టీజీఐఐసీ అధికారులు..
ఘటన స్థలానికి చేరుకున్న తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) అధికారులు తక్షణమే మరమ్మత్తు పనులను ప్రారంభించారు. భారీ యంత్రాలను రంగంలోకి దించి గొయ్యిని పూడ్చే ప్రక్రియను చేపట్టారు. ముందుగా లీకేజీ ఉన్న పైపులను సరిచేసి, ఆపై సిమెంట్ గ్రావెల్తో రోడ్డును పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. పనులు పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున, వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.