కేంద్రం ఏకపక్షంగా, సమాఖ్య రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతున్నదని అఖిల పక్షం అభిప్రాయపడింది. కేంద్రం విధానానికి, డీలిమిటేషన్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించి తెలంగాణ రాష్ట్రం నుంచి నిరసనను వ్యక్తం చేయాలని ఈ సమావేశం నిర్ణయం తీసుకున్నది. బేగంపేట్లోని హోటల్ టూరిజం ప్లాజాలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వివిధ ప్రజా సంఘాల నేతలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై మాట్లాడారు.
పార్లమెంటులో హడావుడిగా డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ తీరుపై సభలో ఇండియా కూటమి సభ్యలు తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా బలంగా వ్యతిరేక నినాదాలు కేంద్రానికి చేరుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి .. కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. చిన్నరాష్ట్రాలకు తీవ్రంగా అన్యాయం చేసేలా డీలిమిటేషన్ ప్రక్రియ ఉందని, దీన్ని హైబ్రిడ్ విధానంలో, ఆర్థిక ప్రతిపత్తి ప్రతిపాదికన చేసి సీట్లు కేటాయించడం ద్వారా తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుందని లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఇవాళ డీలిమిటేషన్ బిల్లు ప్రతులను తగుల బెట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఉద్యమాలకే కేరాఫ్ అయిన తెలంగాణ నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమయ్యింది. అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో దేశానికి సెగ తగిలేలా, చిన్న రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం తెలియజెప్పేలా.. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మూడు రోజుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు… డీలిమిటేషన్, రాజ్యంగ సవరణ బిల్లులను ఆమోదించుకునేలా కేంద్రం అత్యవసర పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ తక్కువ సమయంలో హడావుడిగా చర్చలకు పూర్తి స్థాయి అవకాశం లేకుండానే కేంద్రం అనుకున్నది నెరవేరేలా ఈ సమావేశాలను ముగించేయనుంది. దీంతో దక్షిణాధి రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ నుంచి నిరసన భారీ ర్యాలీ రూపంలో ప్రదర్శించేందుకు డిసైడ్ అయ్యారు. దీన్ని రాజకీయాలకు అతీతంగా, ప్రజా సంఘాలన్నీ మద్దుతుగా నిలిచి విజయవంతం చేయాలని నిర్ణయించారు.
డిలిమిటేషన్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించి మన నిరసనను వ్యక్తం చేద్దాం – ప్రొఫెసర్ కోదండరాం
దేశంలో డిలిమిటేషన్ పేరుతో చిన్న రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీజేఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏ ప్రాతిపదికన డిలిమిటేషన్ తీసుకువస్తున్నారో స్పష్టత లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే ప్రతినిధిత్వం నిర్ణయించడం వల్ల చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇది చిన్న రాష్ట్రాల అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్రగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా డిలిమిటేషన్ ప్రక్రియను మలచుకుంటూ, ఉత్తర–దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం చేసే కుట్రగా కనిపిస్తున్నదని అన్నారు.
సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అలాగే, డిలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత, సమగ్ర చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు.
డిలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా హైదరాబాద్లో అందరం కలిసి ర్యాలీ నిర్వహించి మన నిరసనను వ్యక్తం చేద్దాం అని పిలుపునిచ్చారు.