Minister Sitakka: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేడారం మహా జాతర అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనుల పురోగతిని పరిశీలించేందుకు మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, మంత్రి అట్లూరి లక్ష్మణ్ మంగళవారం మేడారం ప్రాంతాన్ని సందర్శించారు.
మంత్రులు ముందుగా సమ్మక్క సారలమ్మ ఆలయం, పరిసర ప్రాంతాలు, సౌకర్యాల నిర్మాణం, రోడ్లు, పార్కింగ్, తాగునీటి సదుపాయాలు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. అధికారులతో చర్చించి పనుల నాణ్యత, పురోగతి, సమయపాలనపై దృష్టి సారించారు.
తరువాత మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద రాజు, గోవిందరాజులు అంటే మా సీఎం మంత్రులు, మాకు ఉండేది బంధం, బాధ్యతా, భక్తి, భావోద్వేగం అని అన్నారు.
మేడారం అభివృద్ధి పనులు నిష్టతో, చిత్తశుద్ధితో జరుగుతున్నాయి. వచ్చే మహా మేడారం జాతరకు ముందే అన్ని పనులు పూర్తి చేస్తాం. అధికారులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. మేము కూడా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ సూచనలు అందిస్తున్నాం. ఈ ప్రాంతం ఆదివాసుల గౌరవానికి ప్రతీక. ఇక్కడ జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని వనదేవతల పట్ల మన భక్తిని, ఆదివాసుల అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రాంత గొప్పతనాన్ని చాటేలా 90 రోజుల లక్ష్యంతో మిషన్ మోడ్లో పనులు కొనసాగుతున్నాయి అని తెలిపారు.
గతంలో కేవలం ప్రదర్శన కోసం 10 కోట్లతో చెక్డ్యాములు కట్టారు. తరువాత అవి కూలిపోవడంతో మరో కోటి రూపాయలు ఖర్చు చేశారు. కానీ మా ప్రభుత్వం అలా కాదు. ప్రతి రూపాయి ప్రజా ప్రయోజనానికి శాశ్వతంగా నిలిచేలా వినియోగిస్తాం అన్నారు.
మేము అధికారం కోసం కాదు, భక్తుల విశ్వాసం కోసం, ఆదివాసుల ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి పనులు పది తరాలు గుర్తుంచుకునేలా చేస్తాం అన్నారు మంత్రి సీతక్క.
సమ్మక్క సారలమ్మలు చాలా పవర్ఫుల్ దేవతలు. వాటి పేరు మీద రాజకీయాలు చేయడం తగదు. కొన్ని రాజకీయ పత్రికలు, ప్రతిపక్షాలు దేవుడి పేరుతో తప్పుడు ప్రచారాలు చేయడం దురదృష్టకరం. ప్రజలు దేవుడిపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.
ప్రకృతి దేవతలు సమ్మక్క, సారలమ్మలు. బంగారు పతివరు లేకపోయినా కోట్ల మంది భక్తులు వారి పాదాలను చేరడం అదే విశ్వాసం శక్తి. ఆ విశ్వాసం ఎప్పటికీ నిలిచేలా మేము కృషి చేస్తున్నాం అని తెలిపారు.
Also Read: కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణకు శాస్త్రీయ చర్యలు ప్రారంభం.. మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ
మంత్రులు ప్రాంతీయ ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి, వచ్చే వారం రోజుల్లో మేడారం అభివృద్ధి పనుల వేగం ప్రజలకు కనబడేలా చేయాలని సూచించారు.
తప్పుడు ప్రచారాలు వద్దు, రాజకీయాలు వద్దు. ఆదివాసుల అస్తిత్వం, భక్తుల నమ్మకం, వనదేవతల త్యాగం చరిత్ర సీఎం ఆదేశాల మేరకు పనులు పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు.