Uttam Kumar Reddy: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, సాంకేతిక సమీక్షలు వేగవంతం అవుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ బారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలో నీటివనరుల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమ్మక్క సారక్క, సీతారామ సాగర్, దిండి, సింగూరు కాల్వలు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్లోని వివిధ బారేజీల స్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ సమగ్రంగా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ప్రజల డబ్బు ఉంది. అందుకే ఈ పనులు పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతుల్లో జరగాలి అని స్పష్టం చేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బారేజీల పునరుద్ధరణకు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) పర్యవేక్షణలో చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ రెండు సంస్థలు సమగ్ర పరిశీలన చేసి నివేదికలు సమర్పించాయని, వాటి సూచనల మేరకు ప్రభుత్వం మరమ్మత్తు పనులు చేపడుతోందని చెప్పారు.
డిజైన్, క్వాలిటీ లోపాలపై సాంకేతికంగా పరిశీలనలు పూర్తయ్యాకే పనులు ప్రారంభిస్తాం అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్, న్యాయ కమిషన్ నివేదికలను పరిగణనలోకి తీసుకొని తగిన మార్పులు, మరమ్మత్తులు చేపడతారు. ఈ చర్యలన్నీ ప్రజల భద్రత, నీటి వినియోగ సామర్థ్యం, సాంకేతిక సమగ్రత దృష్ట్యా అవలంబిస్తున్నామని చెప్పారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బారేజీల మరమ్మత్తుల ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా, సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారానే భరింపజేస్తాం. ప్రాజెక్ట్ పనుల్లో జరిగిన లోపాలకు బాధ్యులైన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ప్రజల నిధులు వృథా కావడానికి ఎవ్వరినీ వదిలిపెట్టం అని స్పష్టం చేశారు.
ఇది కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి సాగు నీటి ప్రాజెక్ట్ భవిష్యత్తు గురించి. వ్యవసాయానికి నీరు అందించడం అంటే రైతుల జీవనాధారం నిలబెట్టడం. అందుకే పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూస్తాం అన్నారు.
సమావేశంలో మంత్రి ఉత్తమ్, సీతారామ సాగర్, దిండి, సింగూరు కాల్వల పురోగతిపై కూడా అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించారు. ప్రతి ప్రాజెక్ట్లో పారదర్శకతతో పాటు సాంకేతిక సమగ్రత ఉండాలి. ఎక్కడైనా లోపాలు ఉన్నా వాటిని తక్షణమే సరిదిద్దాలన్నారు.
Also Read: బాలికలకు భరోసాగా స్నేహిత.. కరీంనగర్ కలెక్టర్ గొప్ప నిర్ణయం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమీక్షా సమావేశంలో, నీటివనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ చీఫ్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రైతు ప్రాధాన్యతతో ముందుకు సాగాలి. ప్రతి చుక్క నీరు సమర్థవంతంగా వినియోగించబడేలా చర్యలు తీసుకుంటాం. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు సాంకేతికంగా శక్తివంతంగా మారేలా చర్యలు కొనసాగిస్తాం అని తెలిపారు.