Medaram Jatara 2026: మేడారం మహాజాతరలో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుండి బయలుదేరిన సారలమ్మ తల్లి పడిగె రూపంలో జంపన్న వాగును దాటి, అశేష జనవాహిని మధ్య మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంది.
అమ్మవారి రాకతో మేడారం పరిసరాలు భక్తిపారవశ్యంతో మునిగిపోయాయి. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య పూజారులు అమ్మవారిని ఆలయం వద్దకు తీసుకువచ్చారు. మరికొద్ది సేపట్లో తల్లిని గద్దెపై ప్రతిష్టించనున్నారు.
సారలమ్మతో పాటు కొండాయి నుండి బయలుదేరిన గోవిందరాజు కూడా మేడారం చేరుకోవడంతో జాతరలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సమ్మక్క తల్లి రాక కోసం భక్తులు, పూజారులు ఎదురుచూస్తున్నారు.