Telangana Formation Day: తెలంగాణ ప్రజల బాధను ఎవరూ వినలేదని.. ఒక్క సోనియాగాంధీ మాత్రం అర్థం చేసుకున్నారని మాజీ లోక్సభ స్పీకర్ మీరాకుమారి అన్నారు. తెలంగాణ ప్రజల బాధలు చూసి.. రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏళ్లు అయినందుకు ఆనందంగా ఉన్నా.. తొమ్మిదేళ్లైనా, ఇంకా రైతులు, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కాస్త పక్కన జరిగితే పరిస్థితులు అర్థమవుతాయని అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున గాంధీభవన్ లో అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో లోక్ సభలో స్పీకర్ గా ఉన్న మీరా కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విప్లవకారులను సన్మానించారు. ప్రజాగాయకుడు గద్దర్ తన పాటలతో ప్రస్తుత తెలంగాణ పరిస్థితిని వివరించారు.
తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీకి ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం.. మలిదశ ఉద్యమం రావాలని నేతలు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనతో.. రాష్ట్రం వందేళ్లు వెనక్కు వెళ్లిందని.. మద్యం విక్రయాల్లో మాత్రం ముందు వరుసలో ఉందని మండిపడ్డారు.
ఓయు ఆర్ట్స్ కాలేజీ దగ్గర పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ ఫ్రంట్ సభ్యులు సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు నివాళులు అర్పించారు. ఎంతోమంది అమరవీరుల ప్రాణాల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని.. అలాంటి తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ కుటుంబంలో బంధీగా మరిందన్నారు.