Mettu Sai Kumar: తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్.. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం పూర్తిగా గందరగోళంలో ఉన్నారని, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, సాధిస్తున్న విజయాలను చూసి వారికి నిద్ర పట్టడం లేదని వ్యాఖ్యానించారు.
నెక్ట్స్ బిగ్ బాస్ షోకు వెళ్తే కేటీఆర్, హరీష్ రావుకు బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే అన్నింట్లో తలదూర్చే వారికి బిగ్ బాస్లో ప్రాధాన్యత ఉంటుంది అంటూ మెట్టు సాయి కుమార్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై కాకుండా, ప్రతీ విషయంలో విమర్శలు చేయడమే బీఆర్ఎస్ నేతల పనిగా మారిందని ఆయన అన్నారు.
హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ పార్టీ నేతలే నీకు కూర్చోడానికి సీటు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్న పోస్టు తప్ప హరీష్ రావుకు ప్రస్తుతం మరే పదవీ లేదు అని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కీలక శాఖలను నిర్వహించిన నేతగా చెప్పుకునే హరీష్ రావు, ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయారని ఆరోపించారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తోన్న బీఆర్ఎస్ నేతలపై కూడా.. మెట్టు సాయి కుమార్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుని గ్రౌండ్ అవతల పడేశాడు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి మీది కాదు అంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గ్లోబల్ సమ్మిట్ లాంటి ఈవెంట్ల విజయంతో బీఆర్ఎస్ నేతల మైండ్ బ్లాక్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ, కాళేశ్వరం పాపంలో కేసీఆర్తో పాటు హరీష్ రావు పాత్ర కూడా ఉంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ అంశంపై నిజాలు బయటకు వస్తాయి అని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టంపై చర్చ జరగకుండా బీఆర్ఎస్ నేతలు ఇతర అంశాలను లేవనెత్తుతున్నారని ఆరోపించారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించిన మెట్టు సాయి కుమార్, సర్పంచ్ ఎన్నికలతోనే బీఆర్ఎస్ పని ఖతం అయింది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా ఫలితాలు అంతంత మాత్రంగానే వచ్చాయి అని వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజల్లో నమ్మకం పూర్తిగా కోల్పోయిందని ఆయన అన్నారు.
బీఆర్ఎస్–టీఆర్ఎస్ అనే కన్ఫ్యూజన్లోనే ఆ పార్టీ నేతలు ఉన్నారని, పార్టీ పేరు మార్చుకున్నా ఆలోచనల్లో మార్పు రాలేదని విమర్శించారు. మా సీఎం పేరు తీయనిదే కేటీఆర్, హరీష్ రావుకు నిద్ర పట్టదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమం బీఆర్ఎస్ నేతలకు నచ్చడం లేదని వ్యాఖ్యానించారు.
మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలకు ఇక 14 సంవత్సరాలు వనవాసమే. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతూ పాలన సాగిస్తోంది అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.