Mettu Sai Kumar: గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వింత, వికృత రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. తెలంగాణ సమాజానికి హితం చేయడం పక్కనబెట్టి, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా కేటీఆర్ సోషల్ మీడియా విభాగాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. పనికిరాని ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రాస్ బ్రీడ్ డీఎన్ఏ రాజకీయం
తెలంగాణలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అది బీజేపీకి చెందిన ఒక క్రాస్ బ్రీడ్ డీఎన్ఏలా అనిపిస్తోందని సాయి కుమార్ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా అందరూ కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్కు మద్దతుగా నిలుస్తుంటే, బీఆర్ఎస్ మాత్రం లోపాయికారీగా బీజేపీకి సపోర్ట్ చేస్తోందని ఆరోపించారు. ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే కనీసం సానుభూతి చూపకపోగా, ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేయడం బీఆర్ఎస్ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సొంత చెల్లికే రాజకీయంగా అన్యాయం చేసిన కేటీఆర్కు, బయట మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ వస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించేది సీఎం రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈసీపై కేంద్రం ఒత్తిడి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని సాయి కుమార్ ఆరోపించారు. ఎన్నికల సంఘం (ఈసీ) కూడా బీజేపీకి ఒక ప్రధాన అనుబంధ సంస్థలా మారిపోయిందని విమర్శించారు. గతంలో ఓట్లను దొంగిలించిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా సీట్లనే చోరీ చేస్తోందని మండిపడ్డారు. దేశంలో బీజేపీ దుర్మార్గపు పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదని జోస్యం చెప్పారు. తెలంగాణ ఇంచార్జ్లుగా పనిచేసిన కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా గొప్ప స్థానాల్లో ఉన్నారని, తమ పార్టీ ఎప్పుడూ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read: సాగర్ హైవేపై ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. పలువురికి గాయాలు!