MGNREGA: స్వేచ్ఛ బ్యూరో: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన తెచ్చింది. ఇకపై ఉపాధి హామీ కింద చేపట్టే ప్రతి పనికీ ‘జియో ట్యాగింగ్’ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తి కాని పనులకు పైసా కూడా విదిల్చేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అక్రమాలకు తావులేకుండా, కాగితాలపైనే పనులు చూపించి నిధులు డ్రా చేసే వ్యవహారాలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నది. అమల్లోకి తెచ్చింది. అయితే ఉపాధి పనుల నిర్వహణలో క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం నిధుల విడుదలకు అడ్డంకిగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి స్కీమ్ కింద చేపట్టిన పనులు, నిర్మాణాల నిర్వహణలో పారదర్శకత లోపిస్తోంది. రాష్ట్రంలో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. పనులు పూర్తి చేసి, వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తేనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకు 4.31 లక్షల పనులు చేపట్టగా, ఇందులో 3 లక్షల వరకు పనులు ఆన్లైన్ చేయగా.. 1.12లక్షల పనులకూ ఇంకా జియో ట్యాగింగ్ పూర్తికాలేదు. సుమారు 26 శాతం పనులు ఇంకా ఆన్లైన్ రికార్డుల్లోకి ఎక్కలేదు. పెండింగ్లో ఉన్న ఆస్తులలో 97,060 పనులకు సంబంధించి 61 రోజులుగా ఎటువంటి పురోగతి లేదని సమాచారం. పని పూర్తయి రెండు నెలలు గడుస్తున్నది. ఆ పనుల సంబంధించి జరిగాయో, ఎక్కడున్నాయో ఫోటో తీసి వెబ్సైట్లో పెట్టకపోవడంపై రాష్ట్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 321 కోట్ల మెటీరియల్ బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని ప్రారంభం నుంచి ముగింపు వరకు 3దశల్లో ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంది. కానీ, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ప్రక్రియ అనుకున్నంతగా ముందుకెళ్లడం లేదని సమాచారం.
Also Read: కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ మార్క్ మంత్రి మార్పు..!
గతంలో ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒకే పనిని రెండు సార్లు చూపించడం, పాత పనులకే కొత్త బిల్లులు సృష్టించడం వంటి అక్రమాలను అరికట్టేందుకే జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. జియో ట్యాగింగ్ చేస్తే పని ప్రారంభానికి ముందు , పని జరుగుతున్నప్పుడు , పని పూర్తయిన తర్వాత .. ఈ మూడు దశల్లోనూ ఆయా ప్రాంతాల అక్షాంశ, రేఖాంశాలతో కూడిన ఫోటోలను సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయితేనే నిధుల విడుదలకు సిస్టమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, మెటీరియల్ బిల్లులు చెల్లించాలన్నా ఆ పనికి సంబంధించిన జియో ట్యాగింగ్ ఫొటోలు తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా బిల్లులు పంపితే నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా రూ. 31.80 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో రూ. 24.71 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ. 21.34 కోట్లు నిధులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు.మంజూరై ఇంకా ప్రారంభం కాని పనుల మెటీరియల్ ఎంటిటిల్మెంట్ విలువ ఏకంగా రూ. 503.30 కోట్లు ఉండటం గమనార్హం. మెటీరియల్ నిధుల చెల్లింపుల్లో గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు, స్కూల్ టాయిలెట్లు, కాంపౌండ్ వాల్స్ వంటి పనులు ఉన్నాయి. అత్యధికంగా పంచాయతీ భవనాలకు రూ. 117.85 కోట్లు నిలిచిపోయాయి. కాంపౌండ్ వాల్స్ కు రూ. 62.81 కోట్లు, అంగన్వాడీ కేంద్రాలకు రూ. 40.65 కోట్లు పెండింగ్లోఉన్నాయి.
ప్రస్తుతం వ్యవసాయ పనులు లేని కాలం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులపైనే లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. మరోవైపు మెటీరియల్ కాంపోనెంట్ కింద పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో జియో ట్యాగింగ్ ఆలస్యమైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోతాయి. ఫలితంగా కూలీల వేతనాలు, కాంట్రాక్టర్ల బిల్లులు నిలిచిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి యుద్ధప్రాతిపదికన జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.
Also read: BRS Strategy: రాష్ట్రంలో గులాబీ దళం సరికొత్త వ్యూహం.. టార్గెట్ 6 నెలలు..?