కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నాయకులు అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
కృష్ణ జలాలపై అసత్య ప్రచారం
ముఖ్యంగా కృష్ణా నది జలాల వాటా విషయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ‘కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉంది. రైతుల ప్రయోజనాల విషయంలో మేము ఎక్కడా వెనక్కి తగ్గం. కృష్ణా జలాల అంశంపై చర్చకు పిలిస్తే, అసెంబ్లీ నుంచి పారిపోయిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది’ అని అడ్లూరి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వారు నేడు నీతుల పలకడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆర్థిక విధ్వంసంపై విమర్శలు
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర సంపదను దోచుకున్నారని, ఆ అప్పుల భారం నేడు రాష్ట్రంపై పడిందని మంత్రి ఆరోపించారు. ‘బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి వల్ల కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన అప్పులకు నేడు ప్రభుత్వం ప్రతి నెలా భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన వారు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలే సమాధానం
గడిచిన సర్పంచ్ ఎన్నికల్లోనే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని మంత్రి గుర్తు చేశారు. ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు భంగపాటు తప్పదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలనను చూసి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, ప్రతిపక్షాల ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ ప్రభావాన్ని తగ్గించలేవని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.