Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి బుధవారం రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలు పోరాడి సాధించుకున్నారని, ఈ క్రమంలో ప్రాణాలర్పించిన 1100 మంది అమరవీరులే అసలైన ‘జాతిపిత’లని ఆయన స్పష్టం చేశారు. నల్లగొండ బిడ్డ శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య వంటి మహనీయుల త్యాగాలను విస్మరించి కేసీఆర్ను జాతిపిత అనడం సిగ్గుచేటని మండిపడ్డారు.
త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకుందని, కేవలం దోచుకోవడంలోనే కేసీఆర్ జాతిపిత అయ్యారా? అని మంత్రి ప్రశ్నించారు. గతంలో మూడుచింతలపల్లిని దత్తత తీసుకున్న కేసీఆర్, అక్కడ మూడు ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. తెలంగాణ పిల్లల ఆత్మబలిదానాలు చూడలేక మనసు కరిగిన సోనియాగాంధీ గారు రాష్ట్రాన్ని ఇచ్చారని, ఆమెను గౌరవించాల్సింది పోయి కేటీఆర్ తన తండ్రిని జాతిపిత అని పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, తెలంగాణకు నష్టం చేసిన వారు ఏ రకంగా జాతిపితలు అవుతారని ఆయన నిలదీశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంతోనే ఈ మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఓట్ల కోసం వచ్చే నాయకుడిని తాను కాదని, సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. నల్లగొండ ప్రజల్లాగే మేడ్చల్ పరిధిలోని మూడు మున్సిపాలిటీల ప్రజలను చూసుకుంటానని, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.