Munneru retaining wall : ఖమ్మం పట్టణాన్ని వరదల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది. పట్టణం మధ్య నుంచి ప్రవహిస్తున్న మున్నేరు నదికి వరదలు వస్తే.. చుట్టు పక్కల ఉన్న అనేక కాలనీలు నీట మునుగుతుండగా.. వేల మంది నిరాశ్రయులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ఖమ్మాన్ని వరద నీటి నుంచి రక్షించేందుకు చేపట్టాల్సిన పనులపై రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో.. మున్నేరు ఉద్ధృతి భారీగా పెరిగినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించాు.
సరిగ్గా మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు ఖమ్మం పట్టణం అతలాకుతలం అయ్యింది. వాగులు, వంకలు పొంగిపొర్లగా.. మున్నేరు నది ఉగ్ర రూపం చవిచూశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా నది తీవ్ర స్థాయిలో ప్రవహించడంతో… ఖమ్మంలోని అనేక కాలనీలు, ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుని పోయాయి. రోజుల తరబడి వరద నీటిలోనే ఇళ్లు పూర్తిగా నీటమునగగా.. అనేక మంది పూర్తిగా నష్టపోయారు. ఇళ్లు, సామాగ్రి సహా కార్లు, బైకులు వంటి అనేక తీరులుగా నష్టపోయారు. అప్పుడు.. ఖమ్మంలోని పరిస్థితుల్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు మొత్తం రాష్ట్ర యంత్రాగం కదిలిరావాల్సి వచ్చింది. ఆఖరికి.. సీఏం రేవంత్ రెడ్డి సైతం.. అనేక సమీక్షలు నిర్వహించారు.
అలాంటి వరదలకు మళ్లీ ఖమ్మం నష్టపోకుండా ఉండేందుకు.. మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనుల పురోగతిపై అధికారులతో చర్చించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రుల సూచనలు, సలహాలు తీసుకున్న అధికారులు.. మున్నేరు ఉగ్రరూపం దాల్చినా ఖమ్మానికి ఎలాంటి నష్టం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
ఖమ్మం పట్టణానికి ప్రమాదకరంగా మారిన మున్నేరు నదికి ఇరువైపుల యుద్దప్రాతిపదికన రిటైనింగ్ వాల్ పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. మున్నేరు ముంపు నుంచి ఖమ్మం పట్టణాన్ని కాపాడేందుకు నదికి ఇరువైపులా ఆర్ సిసి కాంక్రీట్ గోడలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణం ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో రానుంది. కాగా.. ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లల్లోని దాదాపు 23 కిలోమీటర్ల మేర కాంక్రీట్ గోడ నిర్మాణం చేపట్టనున్నారు.
మున్నేరు వరద నుంచి రక్షణే ప్రధాన ఎజెండాకా నిర్మిస్తున్న ఈ నిర్మాణానికి శాస్త్రీయ, సాంకేతిక అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు.. 1969 నుంచి 2024 సెప్టెంబర్ వరకు వచ్చిన వరదలను పరిగణలోకి తీసుకున్నారు. ఆ గణాంకాల మేరకే.. కాంక్రీట్ వాల్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా.. గోడ నిర్మాణ పనుల వేగం మరింత పెరగాలని సూచించిన మంత్రి పొంగులేటి.. నెలలో రెండు సార్లు స్వయంగా తానే పనుల్ని పర్యవేక్షిస్తానని ప్రకటించారు.
ఈ గోడ నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణను త్వరగా చేపట్టాలని సూచించిన మంత్రి పొంగులేటి.. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఖమ్మం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తాని తెలిపారు. ఈ గోడ నిర్మాణాన్ని సీరియస్ గా తీసుకుని పనిచేయాలని ఆదేశించిన మంత్రి.. నిర్మాణాలకు సంబంధించిన ఎలాంటి సమస్యల్ని అయినా తన దృష్టికి తీసుకుని రావాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పై క్లారిటీ..
తమ ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పేదవాడికి అండగా ఉంటామని ప్రకటించిన మంత్రి పొంగులేటి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్ లను నియమించామన్నారు. మిగతా సిబ్బందిని కేటాయిస్తున్నామని.. త్వరలోనే తమ టార్గెట్ అయిన 20 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 84 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లకు నాలుగు విడుతల్లో రూ. 5 లక్షలు విడుతలు విడుదల చేస్తామన్నారు. గ్రీన్ ఛానెల్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తామన్నారు. అత్యంత పేదవారికి మొదటి విడతలో ఇళ్లు కేటాయించనుండగా.. 400 చ.అడుగుల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.