Cheryal Municipal Elections: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, చేర్యాల ప్రాంతాన్ని చైతన్యానికి అడ్డాగా, పోరాటాలకు పురిటి గడ్డగా అభివర్ణించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాల అభయ హస్తం రుణాలకు సంబంధించిన 200 కోట్ల రూపాయలను కాజేసిందని, పావలా వడ్డీ పేరుతో 3 వేల కోట్ల రూపాయలను దోచుకుందని ఆమె తీవ్రంగా ఆరోపించారు. దీనికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న కుటుంబాల్లో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల బీమాతో పాటు తక్షణ సాయంగా రెండు లక్షల రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు. చేర్యాల అభివృద్ధి కోసం ఇప్పటికే 36 కోట్ల రూపాయలు ఇచ్చామని, మున్సిపాలిటీకి అదనంగా 15 కోట్లు కేటాయించామని, పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు.
మరోవైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, 1300 మంది అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు కేవలం కేసీఆర్ కుటుంబానికే దక్కాయని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని, ఆయన లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు ‘కూలేశ్వరం’గా మారిందని ఎద్దేవా చేశారు. కష్టపడి ప్రజల నుండి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, అమెరికా నుండి వచ్చి పదవులు పొందిన వారు కేటీఆర్ అని చురకలు అంటించారు.
హరీష్ రావు ఈ ప్రాంతానికి రావలసిన సాగునీటిని సిద్దిపేటకు మళ్లించి స్థానిక రైతులను వంచించారని ఆరోపించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చేర్యాల అస్తిత్వాన్ని కోల్పోయిందని, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు పెండింగ్లో ఉన్న 500 కోట్ల నిధులను విడతల వారీగా చెల్లించామని, చేర్యాల మున్సిపల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: CM Revanth Reddy: 70 వేల ఉద్యోగాలిచ్చాం! ఒక్కటి తక్కువైనా నా తల తీసుకుంటా.. కేసీఆర్కు రేవంత్ సవాల్