గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. పల్లెల ప్రగతిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం ములుగు ఆర్అండ్బి గెస్ట్ హౌస్ వేదికగా ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి, గోవిందరావుపేట మండలాల నూతన సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గెస్ట్ హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ తయారీ, తడి-పొడి చెత్త నిర్వహణ స్టాల్లను ఆమె ఆసక్తిగా పరిశీలించారు.
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ కన్న కలలను నిజం చేయాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందని మంత్రి సీతక్క అన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రతి సర్పంచ్ పంచాయతీ రాజ్ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పదవులు హోదా కోసం కాకుండా ప్రజలకు సేవ చేసేందుకేనని గుర్తుంచుకోవాలని చెప్పారు. పాలకులమనే గర్వం వీడి ప్రజలకు సేవకులుగా అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామాల ఆర్థికాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరిగేలా చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రభుత్వం సుమారు 500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని కోరారు. పల్లెలలో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచి వలసలను నివారించాలని సూచించారు. గ్రామ సభలను క్రమం తప్పకుండా నిర్వహించి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాల నిర్మూలనలో సర్పంచులు చురుకైన పాత్ర పోషించాలని మంత్రి కోరారు. గ్రామాల్లోని పేదరికాన్ని రూపుమాపడం, మహిళా సంఘాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఐదు రోజుల శిక్షణలో అధికారులు సర్పంచులకు వారి విధులు, బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా పంచాయతీ అధికారితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.