HAM Roads: స్వేచ్ఛ బ్యూరో: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రహదారులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను మంత్రి సీతక్క ఖండించారు. వాస్తవాలను పక్కనపెట్టి అర్థం లేని విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఆవేశానికి లోనుకాకుండా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలని హరీష్ రావుకు సూచించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ రహదారులను జాతీయ రహదారుల స్థాయిలో ఆధునీకరించడం, కొత్త రహదారుల నిర్మాణం చేపట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని జీర్ణించుకోలేకే ఇలాంటి నిరాధార ఆరోపణలు వస్తున్నారని మండిపడ్డారు. టెండర్ల ప్రక్రియ పూర్తికాకముందే అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరమని మండిపడ్డారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ను కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్) ప్రవేశపెట్టగా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)2016 నుంచి విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 374కు పైగా ప్రాజెక్టులు, సుమారు రూ. 4 నుంచి 5 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ మోడల్ ద్వారా అమలవుతున్నాయని, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల దీర్ఘకాలిక నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తోందని, అందు కోసం గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల లక్ష్యంగా హ్యామ్ మోడల్ తో రహదారుల నిర్మాణం చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.
Also read: మమ్మల్ని చావనివ్వండి కలెక్టర్ గారు.. పురుగుల మందు డబ్బాతో వృద్ధ దంపతుల ఆవేదన..!
హ్యామ్ తొలి దశలో రూ. 6,250 కోట్ల వ్యయంతో 2,162 రహదారులను, మొత్తం 7,450 కిలోమీటర్ల పొడవులో అభివృద్ధి చేయడానికి 17 ప్యాకేజీలుగా పనులు మంజూరు చేశారని, వీటిలో 14 ప్యాకేజీలకు బిడ్లు దాఖలయ్యాయి. మిగతా 3 ప్యాకేజీలకు ఈ నెల 11 వరకు గడువు ఉంది. ప్రస్తుతం సాంకేతిక పరిశీలన పూర్తై, ఆర్థిక బిడ్ల పరిశీలన కొనసాగుతోందని వెల్లడించారు. ఈ పథకం కింద కాంట్రాక్టర్ సంస్థలు 30 నెలల్లో రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేసి, అనంతరం 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను చేపడతాయని, నిర్మాణ దశలో ప్రాజెక్ట్ వ్యయంలో 40% ప్రభుత్వం చెల్లించగా, మిగిలిన 60% మొత్తాన్ని 15 సంవత్సరాల నిర్వహణ కాలంలో యాన్యుటీ రూపంలో చెల్లిస్తుందని, దీంతో తక్కువ వ్యయంతో ఎక్కువ రహదారుల నిర్మాణం సాధ్యమవుతుందని వెల్లడించారు.
ఎన్హెచ్ఏఐ విధానానికి అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీపై గరిష్టంగా 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వవచ్చు, ఈ అడ్వాన్స్ను వడ్డీతో సహా కాంట్రాక్టర్ బిల్లుల నుంచి దశలవారీగా తిరిగి వసూలు చేస్తారని, ఇది కొత్త విధానం కాదని, దేశవ్యాప్తంగా అమలులో ఉందని మంత్రి స్పష్టం చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోవడం కాంట్రాక్టర్కు తప్పనిసరి కాదని కూడా తెలిపారు. ఈ టెండర్లు పూర్తిగా ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థలతో పాటు ఒక అంతర్జాతీయ సంస్థ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. అన్ని నిబంధనలు ఎన్హెచ్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా కచ్చితంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. వాస్తవాలు ఈ విధంగా ఉన్నప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా నిరాధార ఆరోపణలు చేయడం మానుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని, పారదర్శకతతో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Also read: రాంచందర్ రావు బుద్ధి ఉందా.. ఎమ్మెల్యే కుంభం ఫైర్!