Thummala Nageswara Rao: ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకుల విమర్శలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా స్పందించారు. రైతు సంక్షేమంపై తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు పడ్డ ఇబ్బందులను ఆయన ఎండగట్టారు.
“వరి వేస్తే ఉరి” అని గతంలో రైతులను భయపెట్టిన బీఆర్ఎస్ నాయకులకు, నేడు వరి బోనస్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తుమ్మల విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ స్ఫూర్తితో, యూరియా పంపిణీలో పారదర్శకత కోసం ప్రయోగాత్మకంగా 5 జిల్లాల్లో ప్రవేశపెట్టిన యాప్ విజయవంతమైందని తుమ్మల వెల్లడించారు. ఇప్పటికే సుమారు లక్ష మందికి పైగా రైతులు ఈ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నారని తెలిపారు.
యాసంగి సీజన్కు అవసరమైన 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటికే 4.60 లక్షల టన్నులను పంపిణీ చేశామని, మిగిలిన కోటా కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 14,000కు పడిపోయినప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దానిని రూ. 20,000 వరకు పెంచగలిగిందని మంత్రి గుర్తుచేశారు. గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన వారు కూడా రైతులకు సౌకర్యంగా ఉండే యాప్పై అపోహలు సృష్టించడం హాస్యాస్పదమని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రూ. 1,05,000 కోట్లు ఖర్చు చేసిందని, రైతుబంధును రూ. 5000 నుండి రూ. 6000కి పెంచడమే కాకుండా రైతు భీమాను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీని ఏళ్ల తరబడి వాయిదా వేసి, వడ్డీల పేరుతో రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తన నైతికతను చాటుకుందని తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులైన సీతమ్మ బ్యారేజ్, సీతారామసాగర్లను పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 10 లక్షల ఎకరాలను పచ్చగా మారుస్తామని పునరుద్ఘాటించారు. తమది రైతు ప్రభుత్వమని ఇప్పటికే చేతల్లో నిరూపించుకున్నామని, పంట నష్ట పరిహారం కింద మొదటి ఏడాది రూ. 100 కోట్లు, రెండో ఏడాది రూ. 275 కోట్లు కేటాయించి రైతులకు అండగా నిలిచామని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
Read Also: టీటీడీ పాలకమండలి సభ్యుడు రాజీనామా.. అసలు కారణం ఇదేనా?