రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్న ప్రచారాన్ని నమ్మవద్దని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రబీ సీజన్కు అవసరమైన యూరియా నిల్వలు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని, సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు.
అదనపు కోటా కేటాయింపు
ప్రస్తుత రబీ (2025–26) సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు మొత్తం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు 5.84 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంది. వాస్తవానికి ఈ సమయానికి అందాల్సిన కోటా కంటే సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా సరఫరా కావడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటివరకు రైతులు 3.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేయగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ గోడౌన్లలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల (దాదాపు 47.68 లక్షల సంచులు) యూరియా సిద్ధంగా ఉంది.
ప్రత్యేక అధికారుల నియామకం
యూరియా పంపిణీని క్రమబద్ధీకరించేందుకు మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పంపిణీ ప్రక్రియ సాగుతోంది. దీనికి తోడు ప్రతి జిల్లాకు జాయింట్ డైరెక్టర్లు (JDA), అసిస్టెంట్ డైరెక్టర్లను (ADA) ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి, స్టాక్ పాయింట్లు మరియు విక్రయ కేంద్రాల వద్ద యూరియా నిల్వలను, పంపిణీ తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు.
బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం
యూరియా విషయంలో కృత్రిమ కొరత సృష్టించే వారిపై మంత్రి తుమ్మల తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా అక్రమంగా నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా తమ తక్షణ అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని, ప్రతి రైతుకూ అవసరమైన మేర ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల సరఫరాపై ప్రభుత్వం నిరంతర నిఘా ఉంచిందని, రైతులు ప్రశాంతంగా సాగు పనులు చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.