Mothe Village: జగిత్యాల జిల్లా అర్బన్ మండలం మోతె గ్రామంలో మంగళవారం రాత్రి ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి మృతికి చేతబడి, మంత్రాలే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు నమ్మడమే కాకుండా.. చేసిన మంత్రాలను వెనక్కి తీసుకోవాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. మోతె గ్రామానికి చెందిన ఓ యువతి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఏమైందో తెలియదు కానీ, ఈ నెల 12న ఆమె తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ నెల 14న ఆమె మృతి చెందింది. అనంతరం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, గ్రామంలోని శ్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు పూర్తి చేశారు.
అయితే, అసలు వివాదం అంత్యక్రియల తర్వాత మొదలైంది. దహన సంస్కారాల మరుసటి రోజు కుటుంబ సభ్యులు శ్మశానానికి వెళ్ళగా.. యువతి మృతదేహం సగమే కాలిపోయి ఉండడాన్ని గమనించారు. దీంతో వారు మళ్లీ కర్రలు పేర్చి మృతదేహాన్ని పూర్తిగా దహనం చేశారు. కానీ, ఆ తర్వాతి రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శ్మశానానికి వచ్చి, దహనం చేసిన చోట ఉండాల్సిన అస్తికలను ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. అంతేకాకుండా అక్కడ క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కూడా కనిపించాయి.
మృతదేహం సగమే కాలడం, ఆపై అస్తికలు మాయం కావడం, క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో.. తమ బిడ్డ మరణానికి మంత్రాలే కారణమని కుటుంబ సభ్యులు బలంగా నమ్మారు. ఎవరో గిట్టనివారు మంత్రాలు ప్రయోగించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మంగళవారం రాత్రి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కుటుంబ సభ్యులంతా కలిసి చేతిలో కర్రలు పట్టుకుని, రెండు డప్పులతో శబ్దాలు చేస్తూ వీధుల గుండా తిరిగారు. “మా బిడ్డపై చేసిన మంత్రాలు వాపస్ తీసుకోవాలి” అంటూ డిమాండ్ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణం చుట్టూ ఇలాంటి మూఢనమ్మకాల ప్రచారం జరగడం, డప్పులతో రాత్రిపూట ర్యాలీ తీయడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Read Also: Constable Warning: పెళ్లైంది జాబ్ అవసరమా అంటూ.. సీఎం ముందే మహిళా కానిస్టేబుల్ వార్నింగ్